లవర్స్ డే 'పెళ్లి' వివాదం.. ఆరుగురిపై కేసు
మేడ్చల్ : వాలంటైన్స్ డే నాడు ప్రేమజంటకు బలవంతంగా పెళ్లి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీవిల్లో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేమ పెళ్లి తంతు వెలుగుచూసింది. పెళ్లి చేసినోళ్లే వీడియో తీసి వాట్సాప్ లో షేర్ చేయడంతో క్షణాల్లో సమాచారం స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఆ ఘటనలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆరుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.
అనుకున్నదంతా అయింది.. ప్రేమపక్షులకు పెళ్లిళ్లు చేసిన భజరంగ్ దళ్ (వీడియో)
లవర్స్ డే ఎఫెక్ట్
ప్రేమికుల రోజున మేడ్చల్ పరిధిలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో చోటుచేసుకున్న ఘటన సీరియస్ గా మారింది. ఓ అమ్మాయి, అబ్బాయి పార్కులో కనిపించడంతో కొందరు యువకులు వారిద్దరికీ పెళ్లి చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమ జంటకు పెళ్లి చేశారన్న వార్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ పెళ్లి తతంగం కూడా ఆ యువకులే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది జరిగిన గంట వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆ న్యూస్ చర్చానీయాంశంగా మారింది. టీవిల్లో, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది.
దూరపు బంధువులట..!
అల్వాల్ ప్రాంతంలో ఉంటున్న ఓ యువతి (19సం.) కండ్లకోయ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే సిద్ధిపేటకు చెందిన దూరపు బంధువుతో కలిసి ఆక్సిజన్ పార్క్ కు వెళ్లింది. అయితే వాలంటైన్స్ డే కావడంతో కొందరు యువకులు వీరిని అడ్డగించారు. వారు చెప్పేది వినకుండా బలవంతంగా పెళ్లి జరిపించారు. క్షణాల్లో ప్రసారమాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు అలర్టయ్యారు. వీడియో ఆధారంగా ఆ యువకులను గుర్తించే పనిలో పడ్డారు.
ఆరుగురిపై కేసు
అంతలోనే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని.. సైబరాబాద్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు యువతి కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో వీడియో ఆధారంగా గుర్తించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ కు చెందిన బీఎస్పీ నాయకుడు శ్రీహరచారితో పాటు చంద్రశేఖర్, ఆనంద్, అవినాశ్, సురేశ్ కుమార్, అశోక్ ను పీఎస్ కు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.