వరుసకు బావామరుదళ్లు..: తెల్లారేసరికి చెట్టుకు వేలాడుతూ.. 'ప్రేమ'నే బలి తీసుకుందా?
వికారాబాద్: పెద్దలను ఎదిరించే ధైర్యం చేయలేక ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ లో చోటు చేసుకుంది. వరుసకు బావా మరుదళ్లే అయినప్పటికీ.. వీరిద్దరి ప్రేమ పట్ల ఇరు కుటుంబాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇక కలిసి జీవించలేమన్న బాధతో అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
ఎవరు వీళ్లు:
దౌల్తాబాద్ మండలం పోల్కంపల్లికి చెందిన అనంతయ్య కుమారుడు ప్రవీణ్ (18) ఐటీఐ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన భీమప్ప కుమార్తె మంజుల ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. వరుసకు వీరిద్దరు బావా-మరుదళ్లు కావడంతో.. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వ్యతిరేకించిన పెద్దలు:
ప్రవీణ్-మంజులల ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దలకు ఇటీవలే తెలిసింది. ప్రవీణ్ తల్లిదండ్రులు అతన్ని తీవ్రంగా మందలించారు. అలాగే మంజుల తల్లిదండ్రులు కూడా ఆమెకు వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.
మంజులకే వేరే పెళ్లి చేయాలని..:
మంజులకు ఇటీవల దగ్గరి బంధువైన ఓ అబ్బాయితో నిశ్చితార్థం చేయాలని తండ్రి భీమప్ప నిర్ణయించాడు. దీంతో ఈ విషయాన్ని మంజుల హైదరాబాద్లో ఉన్న ప్రవీణ్కు తెలిపింది. మంజుల ఇచ్చిన సమాచారంతో ప్రవీణ్ ఆదివారం రాత్రి పోల్కంపల్లికి చేరుకున్నాడు.
ఉరేసుకుని ఆత్మహత్య..:
ప్రవీణ్ పోల్కంపల్లి చేరుకున్నాక.. మంజులతో ఏం మాట్లాడాడు?.. అన్న దానిపై క్లారిటీ లేదు. ఏమైందో ఏమో తెలియదు కాదు కానీ ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి పోల్కంపల్లి పొలిమేరల్లో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.