ప్రేమికులు: ఒంటిపై కిరోసిన్ పోసుకుని చచ్చిపోతామని పీఎస్లో హైడ్రామా
హైదరాబాద్: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట పెద్దలకు భయపడి ఒంటిపై కిరోసిన్ పోసుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోయిన్పల్లి ఆర్యసమాజ్ వద్ద నివాసం ఉండే కీర్తిరెడ్డి, బాపూజీ నగర్కు చెందిన భవానీశంకర్ (22) గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
నాలుగు రోజుల క్రితం కీర్తిరెడ్డి మేజర్ కావడంతో కూకట్ పల్లిలోని ఆర్యసమాజ్లో వీరిద్దరూ ఈనెల 21న వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం రెండు రోజుల క్రితం బోయిన్ పల్లి పోలీసుల వద్దకు వచ్చిన పెళ్లి చేసుకున్న విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
ఇదే విషయాన్ని కీర్తిరెడ్డి తల్లిదండ్రులకు పోలీసులు తెలియజేశారు. దీంతో కీర్తిరెడ్డి తల్లిదండ్రుల కోరిక మేరకు మాట్లాడేందుకు వారిని శుక్రవారం పోలీస్ స్టేషన్కు పిలిపించారు. గత రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ చేస్తుండటంతో పోలీసులు రమ్మని చెప్పడంతో ఏం జరుగుతుందోనని ఊహించి స్టేషన్ వచ్చే ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు.
దీంతో ఇద్దరూ మేజర్లు కావడంతో ఇలా చేయకూడదని పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.