2009 పరిస్థితులే 2019లో కూడా: ఈసారైనా వరుణదేవుడు కరుణిస్తాడా..?
హైదరాబాదు: కేరళను రుతుపవనాలు తాకాయి. దీంతో అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. ఇక దక్షిణ భారతదేశంలో వర్షాలు అనుకున్నంత స్థాయిలో కురవలేదని ప్రైవేటు వాతావరణ శాఖ కేంద్రం స్కైమెట్ అధికారులు తెలిపారు. వర్షాలు కురువాల్సిన దానికంటే 47 శాతం తక్కువగా దక్షిణ భారతదేశంలో కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చి నుంచి మే వరకు కురిసిన వర్షాలపై వారు నివేదిక విడుదల చేశారు.
గత 65 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇది రెండోస్సారి
స్కైమెట్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2009లో కరువు వచ్చినప్పుడు పరిస్థితి ఎలాగైతే ఉన్నిందో.. అలాంటి పరిస్థితే ఇప్పుడు కూడా కనిపిస్తోందని అన్నారు. ఇక వాయువ్య, మధ్యభారతం, తూర్పు భారతం, ఈశాన్య భారతంలో వరుసగా 30శాతం, 18 శాతం, 14శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఈ సారి గణాంకాలను చూస్తే గత 65 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రెండో అత్యల్ప వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. అంతకంటే ముందు 2012 దీనికంటే అత్యల్ప వర్షపాతం నమోదు అయ్యింది. ఆ సమయంలో 31శాతం కొరతతో వర్షాలు కురిశాయి.
ఎల్నినో ఎఫెక్టే తక్కువ వర్షాలకు కారణం
2009 2019 సంవత్సరాల్లో కురిసిన ముందస్తు వర్షాలు ఒకేలా ఉన్నాయని స్కైమెట్ తెలిపింది. ఈ రెండు సంవత్సరాల్లో 25శాతం తక్కువగా ముందస్తు వర్షాలు నమోదైనట్లు వెల్లడించింది. ఈ రెండు సంవత్సారాల్లో కూడా మరో అంశం ఒకేలా ఉందని చెప్పిన స్కైమెట్ అధికారులు రెండు సంవత్సరాల్లో ఎల్నినో ప్రభావం ఉన్నిందని గుర్తు చేశారు. అందుకే వర్షాలు 2009లో 2019లో ఒకేలా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరిగిన సమయంలో ఎల్నినో ప్రభావం కనిపిస్తుంది.
ముందస్తు వర్షాలతో రైతులకు మేలు
ఇదిలా ఉంటే ముందస్తు వర్షాలు రైతులకు ఒక వరంలా ఉంటాయని పంట వేసేందుకు రైతన్న సిద్ధమవుతాడని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రిన్సిపాల్ మరియు సైంటిస్టు అయిన డాక్టర్ టి. ప్రతిమ చెప్పారు. అంతేకాదు ముందస్తు వర్షాలు కురవడం వల్ల వరి, పల్లీలు, చెరుకు పంటలు వేసేందుకు అదనపు సమయం రైతులకు లభిస్తుందని తెలిపారు. గత కొన్నేళ్లుగా తగ్గుతున్న ముందస్తు వర్షపాతంతో రైతులు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇక భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం వర్షాల కొరతతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాల్లో తెలంగాణ అని తెలుస్తోంది. ఇక ఇదే దారిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇది 500 మిలియన్ మంది ప్రజలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.