ఆ సమస్య ఉంటే ఇబ్బందులు, కరోనాపై మంత్రి ఈటల రాజేందర్ కామెంట్స్..
కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కొంటామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఇతర వ్యాధులు ఉన్నవారిపై వైరస్ వేగంగా ప్రభావం చూపుతోందని అంగీకరించారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం జిల్లా వైద్యాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి వెంటనే గుర్తిస్తే ప్రాణ నష్టం జరగకుండా చూడొచ్చని.. ఆలస్యమైతే కష్టమని అభిప్రాయపడ్డారు. ఎవరికైనా జ్వరం వచ్చిన వైద్యారోగ్య సిబ్బందిని వెంటనే సంప్రదించాలని కోరారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎం కరోనా నిర్దారణ పరీక్షలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో రాపిడ్ టెస్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
Recommended Video
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో వైరస్ విజృంభిస్తోంది. ప్రజా ప్రతినిధులను కూడా వైరస్ వదలడం లేదు. గత 24 గంటల్లో 1554 మందికి పాజిటివ్ సోకగా.. వైరస్ వచ్చిన 9 మంది చనిపోయారు.