నిజామాబాద్ ఎన్నికలు జరిగేనా?.. M-3 ఈవీఎంలపై అర్ధరాత్రి ఈసీ కసరత్తు..!
హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు చర్చానీయాంశంగా మారాయి. సిట్టింగ్ ఎంపీ కవితను వ్యతిరేకిస్తూ 178 మంది రైతులు బరిలో నిలవడం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పేపర్ వాడతారా? లేదంటే ఈవీఎం యంత్రాలా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే M-3 టైపు ఈవీఎంలతో నిజామాబాద్ ఎన్నికలు లాగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ వారం రోజుల వ్యవధిలో అవసరమైనన్నీ M-3 ఈవీఎంలు సమకూరుతాయా లేదా అన్నది ఈసీ అధికారుల ముందున్న ప్రశ్న.
నిజామాబాద్ బరి.. తలనొప్పే మరి..!
నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి కత్తిమీద సాములా మారిందని చెప్పొచ్చు. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో తగిన ఏర్పాట్లు చేసే పనిలో తలమునకలయ్యారు అధికారులు. సమయం తక్కువగా ఉండటం.. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడం.. బ్యాలెట్ పేపర్ల ముద్రణ.. తదితర అంశాలు తలనొప్పి వ్యవహారమని వారు భావించినట్లు తెలుస్తోంది. అందుకే అత్యాధునికమైన M-3 ఈవీఎంలతో నిజామాబాద్ ఎన్నికలు నిర్వహించాలని డిసైడయ్యారు.
నిజామాబాద్ ఎన్నికలకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ మేరకు తగిన కసరత్తు చేస్తోంది. అయితే సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని ప్రత్యేక బృందం.. సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అర్ధరాత్రి సమాలోచన కలిసొచ్చేనా?
ఉమేశ్ సిన్హా రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈవీఎంల ఇన్చార్జి, కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుధీర్ జైన్తోపాటు.. ఈవీఎంల నిపుణులు ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని ప్రత్యేక బృందంలో సభ్యులుగా ఉన్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో.. వీరంతా కలిసి M-3 ఈవీఎంలపై చర్చించారు.
ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. M-3 ఈవీఎంలను సమకూర్చే సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బృందం చర్చించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు నివేదిక రూపొందించి మంగళవారం (02.04.2019) చెన్నైలో జరగనున్న సెంట్రల్ ఈసీ సమావేశంలో మరోసారి చర్చించి.. ఎలా ముందుకెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
కరీంనగర్ బరి..! పొన్నం, బండి, బోయినపల్లి.. గెలిచేదెవరు మరి?
సమయం తక్కువ.. వాయిదా పడే ఛాన్సుందా?
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న M-3 రకం ఈవీఎంలను సేకరించేపనిలో పడ్డారు అధికారులు. అత్యధికంగా 384 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా సరే.. ఈ యంత్రాల ద్వారా ఓటింగ్ నిర్వహించడం చాలా ఈజీ. ఎన్నికల సంఘం దగ్గర M-3 రకం ఈవీఎంలు కొన్ని మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అవసరమనుకుంటే ఈసీఐల్ అధికారులను సంప్రదించి సరఫరా చేయాల్సిందిగా కోరే అవకాశముంది.
పోలింగ్ 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో.. అంతకంటే రెండు రోజుల ముందే నిజామాబాద్ కు M-3 ఈవీఎంలను తరలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యంత్రాలు రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ వాడలేదు. ఆ క్రమంలో పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించాల్సి ఉంది. నిజామాబాద్ సెగ్మెంట్ లో 1,788 పోలింగ్ కేంద్రాలుండటంతో అదే స్థాయిలో 1,788 M-3 ఈవీఎంలు అవసరమవుతాయి. అయితే వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో.. M-3 ఈవీఎంలు సర్దుబాటు అవుతాయో లేదో చూడాలి. ఒకవేళ M-3 ఈవీఎంలు సమకూరనిపక్షంలో నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు వాయిదా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.