మోడీపై ఆర్డర్: మాడభూషి శ్రీధర్ నుంచి ఆ శాఖను తప్పించింది అందుకేనా?
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అధికారాల పరిధి నుంచి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను తప్పిస్తూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్.కె.మాథూర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ పరిధి నుంచి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను తప్పిస్తూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్.కె.మాథూర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల వివరాలు బహిర్గతం చేయమంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయ అధికారులను సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆదేశించడమే దీనికి కారణమని తెలుస్తోంది.
సమాచార హక్కు చట్టం ఆధారంగా 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన విద్యార్థుల వివరాలు వెల్లడించాల్సిందిగా కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ కు సంబంధించి మాడభూషి శ్రీధర్ ఈ రకమైన ఆదేశాలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బీఏ, ఆ తర్వాత గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేశారు. అయితే జూన్ 2016లో ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించిన వివరాలు వెల్లడించాలంటూ ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ఆధారంగా దరఖాస్తు చేసుకున్నాడు.
అనంతరం నీరజ్ అనే మరో వ్యక్తి 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ కోర్సు పాసైన విద్యార్థులందరి వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం కిందే దరఖాస్తు పెట్టుకోగా, అతడు కోరిన వివరాలు తెలుపమంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయ అధికారులను ఆదేశించారు.
ఆ తరువాత కూడా ఇదే విషయానికి సంబందించి మహమ్మద్ ఇర్షాద్, సంజయ్ సింగ్ అనే వ్యక్తులు కూడా దరఖాస్తు చేయగా ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇతర విద్యార్థుల వివరాలు వెల్లడించలేమని పేర్కొంటూ వీరి దరఖాస్తులను తిరస్కరించింది.
దీంతో వీరు కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ జోక్యం చేసుకుని తాము అడిగిన సమాచారం అందించేలా ఢిల్లీ విశ్వవిద్యాలయ అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు.
ఈ విషయంలో దరఖాస్తుదారులు కోరిన సమాచారం అందించడంలో విఫలమైనందుకుగాను ఢిల్లీ విశ్వవిద్యాలయం సమాచార అధికారులకు షోకాజ్ నోటీసు ఇవ్వడమేకాక రూ.25 వేల జరిమానా కూడా విధించారు.
ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 29నే మాడభూషి శ్రీధర్ అధికారాల పరిధి నుంచి ఢిల్లీని తప్పించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ ఏడాది జనవరి 10న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖను కూడా ఆయన పరిధి నుంచి తప్పించింది.
కేంద్ర సమాచార శాఖ కమిషనర్ల అధికారాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే అధికారం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కు ఉన్నప్పటికీ, ప్రధాని విద్యార్హతల వివరాలు కోరుతూ దాఖలైన పిటిషన్ కు సంబంధించి మాడభూషి శ్రీధర్ ఆదేశాలు జారీ చేసిన రెండ్రోజులకే ఆయన అధికారాల పరిధి నుంచి ఆయా శాఖలు, సంస్థలను తప్పించడం గమనార్హం.