ప్రతీకారం, పగల కోసం చట్టాలను వాడొద్దు: మాడభూషి శ్రీధర్
హైదరాబాద్: సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం చాలా ఉందని కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు అన్నారు. పీపుల్స్ ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘ఆర్టిఐ-ప్రజాప్రయోజనాలు' అంశంపై శుక్రవారం హైదరాబాదులోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని మినీహాల్లో సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన ప్రసంగించారు. అధికార యంత్రంగాంలో జవాబుదారీతనం లేకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. సమాచార హక్కు చట్టం జవాబుదారీతనం పెంచడానికి దోహద పడుతుందని చెప్పారు. పగలు, ప్రతీకారాలు, స్వార్థం కోసం చట్టాలను ఉపయోగించవద్దని హితవు చెప్పారు.
సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించే వారిని హత్యలు చేయిస్తున్నారని, అలాంటివారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పౌర సంఘాలు, న్యాయవ్యవస్థలు మాత్రమే సమాచార హక్కు చట్టాన్ని కాపాడుతున్నాయని చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సమాచార హక్కు చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయడం లేదన్నారు.
ప్రతి ప్రభుత్వ శాఖలో సెక్షన్ 41బి అమలు చేయాలని అన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన పెంపొందిచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం ప్రజలల్లో నెలకొన్న అనుమానాలను ఆయన నివృత్తి చేశారు.