కెసిఆర్ మూడెకరాలు ఇస్తానని చెప్పి.. ప్రభుత్వాలు అంతే: మాదాల రవి
అభ్యుదయ చిత్రాలతో ప్రజలను చైతన్య పరిచిన నటుడు మాదాల రంగారావు. విప్లవ కథాంశంతో చిత్రాలను రూపొందించిన ఆయన సంచలన విజయాలను సాధించారు.
అభ్యుదయ చిత్రాలతో ప్రజలను చైతన్య పరిచిన నటుడు మాదాల రంగారావు. విప్లవ కథాంశంతో చిత్రాలను రూపొందించిన ఆయన సంచలన విజయాలను సాధించారు. ప్రస్తుతం ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని తండ్రి బాటలో నడుస్తున్నారు మాదాల రవి. తండ్రి మాదాల రంగారావు నిర్మించిన చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన రవి నేను సైతం చిత్రం ద్వారా హీరో అయ్యాడు. తండ్రి ఆదర్శాలను భుజాన ఎత్తుకొని ప్రజా పోరాటాల్లో పాలు పంచుకొంటున్నారు. తాజాగా మాదాల రవి జన్మదినాన్ని పురస్కరించుకొని వన్ఇండియా.కామ్ ఆయనతో మాట్లాడింది.. రవి వెల్లడించిన భవిష్యత్ కార్యాచరణ ఆయన మాటల్లోనే..
రాజకీయాల్లోకి వస్తారా?
చిన్నప్పటి నుంచి ప్రజా నాట్యమండలితో అనుబంధం ఉంది. వరల్డ్ యూత్ ఫెడరేషన్లో లీడర్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. పలు యూత్ ఆర్గనైజషన్స్లో పని చేశాను . ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. యూరోపియన్ దేశాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నాను. జీఐఎస్ దేశాలకు ప్రతినిథ్యం వహిస్తూ రష్యాలో కల్చరల్ విభాగానికి సెక్రెటరగా పనిచేశాను. ఇలా సామాజిక జీవితంలో అనుబంధం కొనసాగుతున్నది. అలాగే సీపీఐ, సీపీఎం చేస్తున్న అన్ని ఉద్యమాలలో అనేక బాధ్యతలను చేపడతున్నాను. ఆయ పార్టీలో చేపట్టే ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటున్నాను. అన్ని లెఫ్ట్ పార్టీలను ఏకం చేయాలనే కార్యచరణను చేపట్టాను.
వేలాది సభల్లో పాలుపంచుకొన్నా..
గత ఏడేళ్లలో వేలాది సభలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకొన్నాను. ఇప్పటివరకు నేను 100కుపైగా దేశాలు పర్యటించాను. చైనా, ఇతర దేశాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాను. సగటు పౌరుడికి కమ్యునిజం అండగా నిలవడం, అభివృద్ధిని అందించడాన్ని ప్రత్యక్షంగా చూశాను. ప్రజా సమస్యల కోసం ఒక్క సైనికుడిలా పోరాటం చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను.
10 ఏళ్లలో ఎన్నో పోరాటాలు..
నేను వామపక్ష పార్టీలలో పనిచేస్తున్నాను కాబట్టి గత 10 ఏళ్లలో ఎన్నో పోరాటాలు, ఆరు వేళ్ళ సభల్లో రెండు రాష్ట్రాలో ప్రతి గ్రామానికి, పట్టణానికి వెళ్లి ప్రజలను చైతన్య పరిచాం. కానీ ఇవ్వాళ ఎలక్షన్లో డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, దానిపైన కూడా పోరాటం చేయవలసిన భాద్యత ఉంది. ఏరోజైతే డబ్బు ప్రభావం ఎలెక్ టొరల్ సిస్టమ్ నుంచి వెళుతుందో ఆరోజున నిజమైన ప్రజా సేవకులు వస్తారు.
ప్రజా నాట్య మండలితో ఎలాంటి అనుబంధం ఉంది?
రాజకీయాల్లో కూడా ప్రత్యక్ష, పరోక్ష సేవలందిస్తున్నాను. సినీ ప్రముఖులు అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, మదుసూధన్రావు, ప్రకాశ్ రావు, టీ కృష్ణ, మా నాన్న మాదాల రంగారావు లాంటి వ్యక్తులు సేవలందించిన ప్రజా నాట్యమండలి, వామపక్ష పార్టీలతో అనుబంధం ఉంది. ప్రస్తుతం లెఫ్ట్ పార్టీలను ఏకంగా చేయాలని, ఒకే భావం జాలం ఉండి వేర్వేరుగా పార్టీలుగా ఉండే వామపక్ష పార్టీలను మళ్లీ కలిపి ఒకటిగా చేయాలనే కార్యచరణ చేపట్టాం. లెఫ్ట్ పార్టీల మధ్య ఐకమత్యం లేకుండా ఉంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తారు. వారి సమస్యలను ఎలా తీరుస్తారనే విషయాన్ని లెఫ్ట్ పార్టీల నేతలకు వివరిస్తున్నాం.
వామపక్ష పార్టీలను ఏకం చేస్తారా?
ప్రస్తుత సమాజంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతున్నదనే అంశాన్ని సగటు పౌరుడు ఆలోచిస్తున్నాడు. అలాంటి క్రమంలో లెఫ్ట్ పార్టీలు సరైన అవగాహన కల్పించలేకపోతున్నాయి. చైతన్యం చీలితే జగతికి వెలుగు ఏమున్నది అని ప్రముఖ కవి సీ నారాయణరెడ్డి అన్నట్టు.. విడిపోయి అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తున్న వామపక్ష పార్టీలు ఐక్యం కావాలి. ప్రజా సమస్యలే ఎజెండా గా ప్రజా పక్షం పోరాడాలి.
ఎమ్మెల్యే, ఎంపీ పదవికి పోటీ చేస్తారా?
రాజకీయంగా లెఫ్ట్ పార్టీలను ఐక్యం చేయడం నా లక్ష్యం. అంతేగాని రాజకీయంగా లబ్ది పొందడం నా అభిమతం కాదు. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికవ్వడం నా ప్రధాన ధ్యేయం కాదు. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికై నేను ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతాను. నా పొలిటికల్ ఎజెండా మాత్రం లెఫ్ట్ పార్టీలను ఐక్యం చేయడమే. అందుకోసం వామపక్ష పార్టీలు అభ్యదయవాదులు, ప్రగతిశీల శక్తులతో కలిసి పోరాడతాము.
ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వాల వైఖరి ఏంటీ?
భూమి కోసం భుక్తి కోసం అనే నినాదం పాతపడినప్పటికీ.. దేశంలో చాలా మందికి కూడు, గూడు, గుడ్డ అనేది కష్టంగా మారింది. ప్రభుత్వాలు ఏదో ఒక ఆకర్షణీయమైన పథకంలో ప్రజలను మభ్య పెడుతున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ.. అలాంటి కార్యక్రమం ఆచరణలో కనిపించడం లేదు. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు వచ్చినా ఇంకా పేద ప్రజలు పేదరికంలోనే బతుకుతున్నారు.
అణగారిన వర్గాల కోసం పోరాటం
అన్ని వర్గాలను కలిపి ముందుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. అణగారిన వర్గాల అభ్యున్నతికి లెఫ్ట్ పార్టీలు పాల్పడేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. చాలా దేశాల్లో వైద్యం, విద్య అనేది ఉచితంగా ఉన్నాయి. చిన్నదేశమైన శ్రీలంకలో కూడా విద్య అనేది ఉచితమే. అక్కడ ప్రభుత్వ కళాశాలలు బ్రహ్మండంగా ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలను ఎవరూ పట్టించుకోరు. కానీ మనదేశంలో అందుకు విరుద్దంగా కనిపిస్తుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. చట్ట సభల్లో దేశంలో రాష్ట్రం లో అవినీతిని నిర్ములిస్తే ఇవన్నీ సాధ్యం అవ్వడం చాలా సులభం.