మద్దెలచెర్వు సూరి అనుచరుడిపై దాడి: బిల్డర్తో డీల్, రూ.కోట్ల ఆస్తులు.. కొత్త కోణం
బెంగళూరు: మద్దెలచెరవు సూరి అనుచరుడు మధుసూదన్ రెడ్డి పైన దుబాయ్ హెబ్బెట్టు మంజు గ్యాంగ్ దాడిలో మరో కోణం వెలుగు చూసింది. మధుసూదన్ రెడ్డి బెంగళూరులో ఐశ్వర్య బిల్డర్స్ వ్యవహారంలో తలదార్చాడు. ఈ కారణంగానే అతని పైన దాడి జరిగిందని తెలుస్తోంది.
బెంగళూరుకు చెందిన ఐశ్వర్య బిల్డర్స్ యజమాని భాస్కర రెడ్డి. ఆయనకు రూ.50 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఆయనను పదేపదే రావాల్సిన డబ్బులు అడిగారు. దీంతో, వారి నుంచి తనను కాపాడాలని మధుసూదన్ రెడ్డిని బిల్డర్ భాస్కర్ రెడ్డి ఆశ్రయించాడు.
మద్దెలచెర్వు సూరి అనుచరుడ్ని బట్టలిప్పేసి చితకబాదిన హెబెట్టు మంజు గ్యాంగ్
ఈ నేపథ్యంలో అప్పుల వారి నుంచి కాపాడతానని మధుసూదన్ రెడ్డి హామీ ఇచ్చాడు. వెంటనే భాస్కర్ రెడ్డి ఆస్తులను తన పేరు మీద రాయించుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారు భాస్కర రెడ్డి వరకు రాకుండా చూసుకుంటానని నమ్మబలికాడు. ఈ వ్యవహారం అప్పులు ఇచ్చిన వారికి తెలిసింది.
దీంతో చాలామంది మధుసూదన్ రెడ్డిని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే కొందరు వ్యక్తులు మధుసూదన్ రెడ్డిని కిడ్నాప్ చేసి, చితకబాదారు. దీంతో ఈ కోణం తాజాగా వెలుగు చూసింది. అప్పులు ఇచ్చిన వారికి చెందిన వ్యక్తులే ఆయనని చితగ్గొట్టిన్నట్టుగా తెలుస్తోంది.
కాగా, మద్దెలచెర్వు సూరి అనుచరుడు మధుసూదన్ రెడ్డిని బెంగళూరులో బట్టలు ఊడదీసి చితకబాదిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీని వెనుక బెంగళూరు డాన్ హెబెట్టు మంజు హస్తం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, దీనికి సంబంధించి తాజాగా ఈ ట్విస్ట్ వెలుగు చూసింది.
సూరి తెలియదు, మధుసూదన్ రెడ్డి తెలియదు
మద్దెలచెర్వు సూరి అనుచరుడు మధుసూదన్ రెడ్డిని బట్టలు ఊడదీసి, కర్రలతో చితగ్గొట్టిన ఘటన పైన బెంగళూరు డాన్ హెబ్బెట్టు స్పందించాడని తెలుస్తోంది. టీవీలో వీడియోను చూశానని, అందులో ఉన్న దానికి, తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పాడు.
తనపై గతంలో ఉన్న కేసులన్నీ క్లియర్ చేసుకుని, ఆరేళ్ల క్రితమే తాను బెంగళూరు వదిలి దుబాయ్ వచ్చేశానని, ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నానని చెప్పాడు. తాను బెంగళూరులో దందా చేసే సమయంలో వందకు పైగా గ్యాంగులు ఉండేవన్నాడు. వారిలో ఎవరైనా వీడియోలోని వ్యక్తిని కొట్టారేమో తనకు తెలియదని చెప్పారు.
మద్దెలచెరువు సూరి కానీ, అతని అనుచరుడు మధుసూదన్ రెడ్డి కానీ తనకు తెలియదన్నాడు. తన పేరును బద్నాం చేసేందుకే ఎవరో తన పేరుతో వీడియో విడుదల చేసినట్టు ఉన్నారన్నాడు. త్వరలోనే బెంగళూరు వస్తానని, అసలు ఏం జరిగిందో కనుక్కుంటానని చెప్పాడు.