సన్నిహితంగా ఉండి ప్రియుడు నో, టెక్కీ సునీతది ఆత్మహత్యే: ఇదీ జరిగింది
సాఫ్టువేర్ ఇంజినీర్ సునీతది ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడితో వాట్సాప్లో సందేశం పంపించినట్లు ఏసీపీ తెలిపారు.
హైదరాబాద్: సాఫ్టువేర్ ఇంజినీర్ సునీతది ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడితో వాట్సాప్లో సందేశం పంపించినట్లు ఏసీపీ తెలిపారు. తనను పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని కూడా సందేశం పెట్టారన్నారు.
16 ఏళ్ల కిందట లవ్ ఫెయిల్, ఇప్పుడూ..: వీడిన టెక్కీ కేసు, సునీతది ఆత్మహత్యే!
సునీత నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలిందని మాదాపూర్ ఏసీపీ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులోను గొంతు నులిమిన ఆనవాళ్లు లేవని చెప్పారు. సునీత ఆత్మహత్యకు కారణమైన యువకుడిని శ్రవణ్గా గుర్తించారు. అతని పైన ఐపీసీ 306 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
తొలుత హత్యగా భావించారు
మంగళవారం విలేకరులతో ఏసీపీ రమణ కుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శశాంక్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల పదిహేనో తేదీన మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీ నిర్జన ప్రదేశంలో పొదల్లో బన్సీలాల్పేటకు చెందిన ఓ కాల్ సెంటర్ ఉద్యోగిని సునీత మృతదేహం పూర్తిగా కాలిన స్థితిలో గుర్తించినట్లు చెప్పారు. తొలుత హత్యగా భావించారు.
వాట్సాప్ సందేశాలు
ఆమె మృతదేహం వద్ద సగం కాలిన హ్యాండ్ బ్యాగు, అందులో సగం కాలిన కంపెనీ ఐడీ కార్డు, సిమ్కార్డు లభించాయి. సదరు సిమ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసి ఫోన్ కాల్స్ వివరాలు సేకరించి కూకట్పల్లికి చెందిన శ్రవణ్ (33) అనే వ్యక్తితో తరచూ సునీత మాట్లాడినట్లు గుర్తించారు. వాట్సాప్లోను అతనికి మెసేజ్లు పంపినట్లు గుర్తించారు.
ఆరేళ్ల క్రితం పరిచయం.. మతం మారి..
ఆరేళ్ల కిందట సునీత ఓ కంపెనీలో పనిచేసే సమయంలో అక్కడే పని చేస్తున్న శ్రవణ్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరు వేర్వేరు కంపెనీలకు మారారు. తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం, కలుసుకోవడం.. వాట్సాప్లో సందేశాలు పంపించుకునేవారు. ఇస్లాం మతానికి ఆకర్షితురాలైన సునీత.. రెండేళ్ల క్రితం తన పేరు హజ్రానూర్గా మార్చుకుంది. చనువుతో శ్రవణ్ను మ్యాడి అని పిలిచేది. ఈ పేర్లతోనే వారి మధ్య చాటింగ్ జరిగింది.
చనిపోతానని..
కొంతకాలంగా సునీత తన ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకోవాల్సిందిగా శ్రవణ్పై ఒత్తిడి తెస్తోంది. ఇందుకు అతను నిరాకరిస్తూ వచ్చాడు. ప్రేమికుల రోజున తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాలని, లేకపోతే చనిపోతానని ఈ నెల పదో తేదీన వాట్సాప్లో మెసేజ్ పంపింది. 14న కలవకపోతే మరుసటి రోజున నుంచి సందేశాలు పంపవద్దని, చనిపోతానని చెప్పింది.
ఈసారి పట్టించుకోలేదు
శ్రవణ్ మాత్రం తాను ఆమెకు శ్రేయోభిలాషిని మాత్రమేనని చెబుతూ ఫోన్ నంబరును బ్లాక్ చేశాడు. నాలుగు నెలల క్రితం సునీత ఇదే విధంగా ఒత్తిడి చేయడంతో అతను ఈసారి పెద్దగా పట్టించుకోలేదు.
కిరోసిన్ డబ్బాతో..
వాలెంటైన్స్ డే రోజు ఉదయం ఆఫీస్కు వెళ్తున్నట్లు సునీత ఇంట్లో చెప్పి వచ్చి పటాన్చెరు సమీపంలోని మత్తంగికి వెళ్లింది. అక్కడ ఓ ప్రార్థన మందిరంలో 20 నిమిషాలు ప్రార్థనలు చేసింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో ఉన్నాయి. ప్రార్థన మందిరంలోనికి వెళ్లే సమయంలో చేతిలో కిరోసిన్ డబ్బా కవర్ ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. అనంతరం అక్కడి నుంచి మాదాపూర్లోని శిల్పారామం వచ్చి అక్కడి నుంచి శ్రవణ్ ఉండే కూకట్పల్లి ప్రాంతానికి, అటు నుంచి రామచంద్రాపురం వరకు వెళ్లినట్లు పోలీసులు ఆమె సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా గుర్తించారు.
ఫోన్ స్విచ్ఛాప్
ఆ తర్వాత సునీత సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. ఆ రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లిన సునీత తన సెల్ఫోన్ పాడైందని, మరమ్మతులకు ఇచ్చినట్లు ఇంట్లో వాళ్లకు చెప్పింది. పదిహేనో తేదీన తన సోదరుడు నర్సింగ్ రావు ద్విచక్ర వాహనంపైన ఆమెను సికింద్రాబాద్ బస్టాప్ వద్ద దింపిన దృశ్యాలు సీసీటీవీల్లో లభించాయి. అదే రోజు మధ్యాహ్నం భాగ్యనగర్ సోసైటీ పొదల్లో శవమై కనిపించింది.
శ్రవణ్ పైన కేసు
14న రోజు సాయంత్రమే సునీత తన వెంట తెచుకున్న కిరోసిన్ డబ్బాను భాగ్యనగర్ సొసైటీ పొదల్లో దాచి ఉంచి ఇంటికి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరుసటి రోజున అదే మార్గంలో వెళ్లే శ్రవణ్ను కలుసుకుందామని భావించినా.. వీలుపడక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో సన్నిహితంగా ఉండి ఆ తర్వాత పెళ్లికి నిరాకరించి, ఆమె ఆత్మహత్యకు కారణమయిన శ్రవణ్ పైన కేసు నమోదు చేశారు.
సునీత వద్ద శ్రవణ్ పలుమార్లు దాదాపు రూ.లక్ష మేర తీసుకున్నట్లు వివరించారు. ప్రేమ పేరుతో సునీతతో సన్నిహితంగా ఉండి చివరికి పెళ్లికి నిరాకరించి ఆమె ఆత్మహత్యకు కారణమైన శ్రవణ్పై కేసు నమోదు చేసినట్లు రమణకుమార్ పేర్కొన్నారు. 2016 మే 23 నుంచి 2017 ఫిబ్రవరి 13వ తేదీ వరకు వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ మెసేజ్లకు సంబంధించి 600 పేజీల వివరాలు సేకరించినట్లు రమణకుమార్ తెలిపారు.