మా ఆయన బంగారమే, కానీ...: సింగర్ మధుప్రియ, ఎపిసోడ్లో మరో ట్విస్ట్
హైదరాబాద్: మా ఆయన మంచోడే అంటూ సింగర్ మధుప్రియ ఆదివారం రాత్రి ట్విస్ట్ ఇచ్చారు. పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం ఆమె మీడియాతో ఆ మాట అన్నారు. కానీ, ఆయనతో వెళ్లడానికి తనకు సమయం కావాలని చెప్పింది. మధుప్రియ ఆరునెలల క్రితం పెద్దలను ఎదిరించి, శ్రీకాంత్ను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: మధు ప్రియ , శ్రీకాంత్ వివాదం గురించి మరికొన్ని విశేషాలు
అయితే తన భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ మధుప్రియ శనివారం పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత పలు నాటకీయ పరిణామాల అనంతరం 24 గంట హైడ్రామకు తెర పడింది. పోలీసుల కౌన్సిలింగ్ ఫలించింది. ఆదివారం ఇరు పక్షాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన హుమాయున్నగర్ పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు.
రాజీ అనంతరం శ్రీకాంత్ ప్రవర్తన మంచిగానే ఉందని, ఆయనకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మధుప్రియ చెప్పింది. అయితే మరో 10 రోజులు తనకు సమయం కావాలని, అప్పటివరకూ తల్లిదండ్రుల వద్దే ఉంటానని మధుప్రియ తెలిపింది. దాదాపు ఐదు గంటల పాటు పోలీసుల కౌన్సిలింగ్ కొనసాగింది. శ్రీకాంత్ కూడా సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. మరో రెండు రోజుల తర్వాత మరోసారి వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.
ఇదిలావుంటే, మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్ వ్యవహారం మరో ఊహించని మలుపు తిరిగింది. శ్రీకాంత్ అని భ్రమపడి అర్థరాత్రి మహ్మద్ నయీమ్ అనే వ్యక్తిని మధుప్రియ బంధువులు చితకబాదారు. రామంతాపూర్లోని ఓ ఆస్పత్రిలో ఆ యువకుడికి చికిత్సనందిస్తున్నారు.
అయితే ఆ వ్యక్తి శ్రీకాంత్తో పాటు మధుప్రియ ఇంటికి వెళ్లిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మధుప్రియ బంధువులపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.