డబ్బు తీసుకొని కేటీఆర్ ఎలా దొరికారో చెప్తా: కేటీఆర్పై యాష్కీ, రేవంత్ చేరిక, రాహుల్ 58 టూర్పై
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత మధుయాష్కీ ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గతంలో 58 రోజుల పాటు ఎక్కడకు వెళ్లింది, తన భార్య విషయంలో వచ్చిన రూమర్స్, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరిక తదితర అంశాలపై స్పందించారు.
2జీ స్కాం విషయమై మాట్లాడుతూ నాటి కాగ్ వినోద్ రాయ్ 200 శాతం బీజేపీ మనిషి అని చెప్పారు. కేటీఆర్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు 2జీ స్కాం జరగలేదన్నారు. ఈ మాట కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతోందన్నారు. ఈ కేసు జీరో పర్సెంట్ లాస్ అని కపిల్ సిబాల్ ఆ రోజే చెప్పారన్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంపై
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గత నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై యాష్కీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమే అన్నారు. ఇతర పార్టీల నుంచి మన పార్టీలోకి ఎవరు వచ్చినా కాదనకుండా చేర్చుకోవాలనేది మా పార్టీ పాలసీ అని, అందుకే రేవంత్ను చేర్చుకున్నామని చెప్పారు. రేవంత్ మంచి యువ నాయకుడు అని, ప్రజాదరణ కలిగిన నేత అన్నారు. నేతలు కాంగ్రెస్లోకి వస్తున్నారంటే బలోపేతం అయ్యే అవకాశాలున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ ఉంటుందని రేవంత్ వంటి వారు వస్తున్నారన్నారు.
కేటీఆర్, కవితలపై
కేటీఆర్, కవిత నామినేషన్ వేసిన సమయంలో అఫిడవిట్లో ఎంత డబ్బులున్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయో చెప్పాలని యాష్కీ సవాల్ చేశారు. టూవీలర్ కంపెనీతో డబ్బులు తీసుకొని కేటీఆర్ ఏ విధంగా అడ్డంగా దొరికిపోయారో త్వరలో మీడియాకు వెల్లడిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు సేకరించామని, సరైన సమయం చూసుకొని మీడియా ముందుకు వస్తామన్నారు. తాము వదిలే ప్రసక్తి లేదని, తన పదేళ్ల జీవితంలో తాను పొగొట్టుకున్నది తప్ప సంపాదించుకున్నది లేదన్నారు.
58 రోజులు రాహుల్ ఎక్కడకు వెళ్లారంటే
గతంలో రాహుల్ గాంధీ ఎవరికీ అందుబాటులో లేకుండా 58 రోజులు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై యాష్కీ స్పందించారు. రాహుల్ వెళ్లింది బుద్దిస్ట్ ట్రైల్ కొరకు మాత్రమేనని, కంబోడియా టు బర్మా వెళ్లారని చెప్పారు. ఈ విషయాలు ప్రభుత్వానికి తెలుసునని చెప్పారు. కానీ అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు.
ఇదీ మోడీకి, రాహుల్కు తేడా
2008లో రాహుల్ గాంధీతో పాటు తాను జపాన్ వెళ్లానని యాష్కీ చెప్పారు. తమతో పాటు ఒమర్ అబ్దుల్లా, సచిన్ పైలట్ ఉన్నారని, మేం సూట్లు వేసుకుంటే రాహుల్ కుర్తా పైజామ వేసుకున్నారని చెప్పారు. మోడీ ఎప్పుడు పేదల దగ్గర నుంచి వచ్చామని మాట్లాడుతారని, వేసేది మాత్రం విదేశాల నుంచి వచ్చిన లక్షల రూపాయల సూట్లు అన్నారు. రాహుల్ అలా కాదన్నారు. అలాగే, తన భార్య తనను వదిలి వెళ్లిపోయిందని, విడాకులు తీసుకున్నదని ప్రచారం జరిగిందని, దీనిపై కేసు వేసి రూమర్స్ సృష్టించిన వారిని అరెస్ట్ చేయించడం జరిగిందన్నారు.