బెత్తెడుగాళ్లు, కెటిఆర్ శ్రీమంతుడికి నిర్మాత, బాహుబలికి డిస్ట్రిబ్యూటర్: యాష్కీ
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కెటి రామారావుపై, ఇతర మంత్రులపై కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెత్తెడుగాళ్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మంత్రివర్గంలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ తనయుడు కెటి రామారావు శ్రీమంతుడు సినిమాకు నిర్మాత, బాహుబలి సినిమాకు డిస్ట్రిబ్యూటర్ అని ఆయన అన్నారు.
తెలుగు ప్రజలను ఇద్దరు చంద్రులు మోసం చేస్తున్నారని మధుయాష్కి ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని, చంద్రులు మాత్రం లడ్డూలు పంచుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రులు వెన్నెల పంచుకుంటూ తెలుగు ప్రజలకు అమావాస్య చూపెడుతున్నారని విమర్శించారు.
మహిళా రైతుల మంగళసూత్రాలు తెగుతుంటే టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యురాలు కవితకు తెలియడం లేదా అని మధుయాష్కి ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్ల కోసమే కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్తున్నారని మధుయాష్కి ఆరోపించారు.
హైకోర్టు విభజనపై చంద్రబాబుతో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వాటర్ గ్రిడ్లో కేటీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తే, రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కేటీఆర్ సిద్ధమా అని మధుయాష్కి సవాల్ విసిరారు. కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని మాజీ ఎంపీ మధుయాష్కి జోస్యం చెప్పారు.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే కెసిఆర్ చంద్రబాబును అన్నా అని పిలుస్తున్నారని ఆయన అన్నారు. కెటిఆర్కు అక్రమ విల్లాలు ఉన్నాయని, ప్రత్యేక విమానాల్లో విహార యాత్రలు చేస్తున్నారని, కెటిఆర్ అవినీతికి ఇవే నిదర్శనాలని ఆయన అన్నారు.