ఇద్దరు చంద్రులు ఏకం, సిబిఐ విచారణ జరపాలి: రోజా సస్పెండ్ దారుణమన్న మధుయాష్కీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె చంద్రశేఖర్ రావు ఏకమయ్యారని తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఆరోపించారు. ఇద్దరూ ఏకమై ప్రజా దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థలతో కలసి క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నారని అన్నారు. ఆయుత చండీయాగం వ్యక్తిగతమంటున్న కెసిఆర్.. అధికార యంత్రాంగాన్ని ఎందుకు మోహరిస్తున్నారని ప్రశ్నించారు.
జిహెచ్ఎంసి ఎన్నికల కోసం వేల హోర్డింగ్లు పెట్టారని మధుయాష్కీ ఆరోపించారు. ప్రజాధనాన్ని వ్యక్తిగత ప్రచారాలకు ఖర్చు చేస్తున్న సీఎం కెసిఆర్పై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బిసి క్రిమిలేయర్ దారుణమని వ్యాఖ్యానించారు.
ఏపిలో వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. ప్రశ్నించే వారు లేకుండా సభను ఏవిధంగా నడుపుతారని మధుయాష్కీ ప్రశ్నించారు.
టిఆర్ఎస్ ప్రజల నోట్లో మన్నుకొట్టింది: చిన్నారెడ్డి
ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నోట్లో మన్నుకొట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాటి తెలంగాణ ఉద్యమం-నేటి అనైతిక రాజకీయాలు, రేపటి భవిష్యత్' అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ హోల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికార పార్టీ రాజకీయ వలసలను ప్రోత్సహిస్తూ నైతికంగా దిగజారి పోయిందన్నారు. రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు పోరాట వారసత్వం ఉందని అందువల్ల పోరాడి హక్కులను సాధించుకుంటారని చెప్పారు.