మంత్రి పదవి రాదనే కవిత రివర్స్ గేర్, ఇది దద్దమ్మ ప్రభుత్వం: మధుయాష్కీ ఫైర్
హైదరాబాద్: కేంద్ర మంత్రి పదవి రాదనే ఉద్దేశ్యంతో టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత రివర్స్ గేర్లో మాట్లాడుతున్నారని మాజీ ఎంపి, ఏఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్లో ఇటీవల జరిగిన సభలో కవిత ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ బాగా పని చేస్తున్నారని మెచ్చుకున్నారని గుర్తు చేశారు.
ఇప్పుడేమో తెలంగాణ ప్రభుత్వం పట్ల కేంద్రం వివక్ష చూపిస్తున్నదని విమర్శించడం రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని యాష్కీ మండిపడ్డారు. ప్రధాని మోడీతో సెల్ఫీలు దిగినప్పుడు, కేంద్ర మంత్రులతో ముచ్చట్లు పెట్టినప్పుడు, కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడుతో పోలీసు వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వివక్ష గుర్తు రాలేదా? అని ఆయన నిలదీశారు.
తెలంగాణ ప్రభుత్వం చేతకాని, చేవలేని దద్దమ్మలా మారిందని, కేంద్రం వివక్ష చూపిస్తున్నదని టిఆర్ఎస్ ఎంపీలు విమర్శించడం వారి చేతకానితనానికి నిదర్శనమని మధుయాష్కీ విమర్శించారు.
రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో లబ్ది పొందడానికి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు.