‘తనదాక వచ్చిందనే నయీం ఎన్కౌంటర్: కేవీపీతో కేసీఆర్ వ్యాపారాలు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కీ. ఆయన సోమవారం మాట్లాడుతూ.. కెసిఆర్ పాలనే తెలంగాణకు అరిష్టమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వమే నెంబర్గా నిలుస్తోందని ఎద్దేవా చేశారు. అంతేగాక, మిషన్ భగీరథ దేశంలోనే పెద్ద కుంభకోణమని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సన్న బియ్యం, నల్లా నీళ్ల కోసమే వచ్చిందా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ బిడ్డ కవిత లాండ్ సెటిల్మెంట్లు, అల్లుడు ఇసుక దోపిడీ , కొడుకు ప్రత్యేక విమానాల్లో షికారు చేస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రతో ఒప్పందం జరిగిపోయినట్లు గతంలో ప్రచారం చేసిన టిఆర్ఎస్ నేతలను గాడిదలపై ఊరేగించాలని అన్నారు.
సీఎం కేసీఆర్ సన్నిహితులతో సెటిల్మెంట్ చేసినందుకే నయీంను ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. అంతేగాక, కేసీఆర్.. కుల గజ్జితోనే కేవీపీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కేవీపీతో కేసీఆర్ ఫ్యామిలీ బినామీ వ్యాపారాలు చేస్తోందని ఆరోపించారు. కేవీపీపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.