డబ్బులు 'డబుల్' కావాలని కాదు: రూ.1.33 కోట్ల దోపిడీపై సందేశ్
హైదరాబాద్: డబ్బులు డబుల్ అవుతాయని తాము పూజలు చేయలేదని, దొంగ బాబా తమను నమ్మించి మోసం చేశాడని లైఫ్ స్టైల్ ఓనర్ మధుసూదన్ రెడ్డి తనయుడు సందేశ్ రెడ్డి శుక్రవారం నాడు చెప్పారు. మొదట తెలంగాణ పోలీసులకు ప్రత్యేక ధన్యావాదాలు అన్నారు.
తాము ఆ బాబాను గృహప్రవేశం పూజ కోసం పిలిపించామని చెప్పారు. మా ఇంట్లోనే బాబా డబ్బులు పూజ వద్ద పెట్టమని చెప్పాడని, అలా పెట్టడం తమ తప్పేమీ కాదన్నారు. కాకుంటే దొంగ బాబా అని తెలియక మోసపోయామని చెప్పారు.
ఇంట్లో దోషం ఉందని చెప్పి పూజలు చేశాడన్నారు. తమకు ప్రసాదంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయేలా చేశాడని చెప్పారు. అప్పుడో డబ్బులు దోచుకెళ్లాడని చెప్పారు. మా నాన్నకు ఓ స్నేహితుడి ద్వారా నకిలీ బాబా పరిచయం అయ్యాడని చెప్పారు. డబ్బులు డబుల్ అవుతాయని, తామేదో రాత్రికి రాత్రి అంబానీలం కావాలని ఈ పూజలు చేయలేదని చెప్పారు.
నిందితుడిని తాము శివానంద బాబా అని పిలిచేవాళ్లమని చెప్పారు. ఆయన తమను నమ్మించి మోసం చేస్తాడని అనుకోలేదన్నారు. కాగా, బెంగళూరులో అరెస్టైన ఆ దొంగ బాబా పైన బంజారాహిల్స్ పోలీసులు 307, 420, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శివానందతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారని తెలుస్తోంది.