‘ఇది గెలుపు రూపాయి’: ఆ పెద్దావిడ కాళ్లకు మొక్కిన మాజీ స్పీకర్ చారి, కంటతడి
భూపాలపల్లి: తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీఆర్ఎస్ నేత సిరికొండ మధుసూదనాచారి బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎంపేడు, వెల్లంపల్లి, బండ్లపల్లి ప్రాంతాల్లో పర్యటించారు.
పెద్దావిడ పలకరింపు..
ఆ తర్వాత కుందనపల్లిలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి కొద్దిసేపు అక్కడ సేద తీరారు. ఈ సమయంలో అక్కడకు రాజమల్లవ్వ(70)అనే పెద్దావిడ చేరుకుంది. మధుసూదనాచారి ఆ పెద్దావిడను పలకరించారు.
మళ్లీ గెలవాలంటూ..
రాజమల్లవ్వ స్పందిస్తూ.. తన చేతిలోని ఒక్క రూపాయి నోటను మధుసూదనాచారి చేతిలో పెట్టింది. ‘ఇది నీ ఎన్నికల కోసం ఇస్తున్నా.. చందా అనుకో. నీ పేరు మీద దేవుడికి ముడుపు కూడా కడుతున్నా. నువ్వు మళ్లీ గెలవాలని మొక్కుతున్నా' అని ఆ పెద్దావిడ చెప్పింది.
కంటతడి పెడుతూ.. భావోద్వేగానికి గురైన చారి
ఈ క్రమంలో మధుసూదనాచారి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ‘నీలాంటి వాళ్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తల్లీ..' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ పెద్దావడి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
గెలుపు రూపాయంటూ..
అంతేగాక, ఆమె ఇచ్చిన రూపాయి నోటును జేబులో దేవుడి ఫొటోలతోపాటు జాగ్రత్తగా ఉంచుకుంటానని మధుసూదనాచారి తెలిపారు. ఈ రూపాయి తన గెలుపునకు గుర్తుగా మిగిలిపోతుందని ఉద్వేగంతో వ్యాఖ్యానించారు.