కేసీఆర్ ప్రోద్బలంతోనే హెచ్సీయూలో దాడులు, కోర్టుకెళ్తా: మధుయాష్కి
కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే హెచ్సీయూలో దాడులు జరుగుతున్నాయని మధుయాష్కి ఆరోపించారు.
వాటర్ గ్రిడ్ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పథకమని అన్నారు. కేసీఆర్ ప్రశ్నించేవారిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మధుయాష్కి ఆరోపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల కేటాయింపులపై కోర్టుకు వెళ్తామని మధుయాష్కి అన్నారు.
విద్యార్థులను, ప్రొఫెసర్లను బేషరతుగా విడుదల చేయాలి
హెచ్సీయూలో అరెస్ట్ చేసిన విద్యార్థులను, ప్రొఫెసర్లను బేషరతుగా విడుదల చేయాలని హెచ్సీయూ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. హెచ్సీయూ నుంచి పోలీసు బలగాలు వెళ్లిపోవాలని కోరారు. మార్చి 22న జరిగిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు.
హెచ్సీయూ విద్యార్థులను విడుదల చేయాలి: అసదుద్దీన్
చర్లపల్లి జైళ్లో ఉన్న హెచ్సీయూ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించేలా చూస్తామని ఆయన చెప్పారు.