క్షమించాలి, ప్రత్యేక పరిస్థితుల్లోనే: కెసిఆర్తో కండువా కప్పించుకున్న మాగంటి, అరికపూడి
హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమక్షంలో శుక్రవారం తెలుగుదేశం ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ టిఆర్ఎస్లో చేరారు. గాంధీ, గోపీనాథ్కు పార్టీ కండువా కప్పి సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఇప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యేలు 12 మంది టీఆర్ఎస్లో చేరారు.
సీఎంను కలిసిన వారిలో ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, జీ సాయన్న, టీ ప్రకాశ్గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, చల్లా ధర్మారెడ్డి, ఎస్ రాజేందర్రెడ్డి, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ ఉన్నారు. టీడీఎల్పీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేసినట్లు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.
నియోజకవర్గ అభివద్ధి కోసమే టిఆర్ఎస్లో చేరా: అరికపూడి
హైదరాబాద్ అభివృద్ధి ఎజెండాగా టీఆర్ఎస్లో చేరానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. ఇన్నాళ్లు టీడీపీలో అంకిత భావంతో పని చేశానని తెలిపారు. పార్టీలో సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు.
ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో, ప్రజల అభిమతం మేరకే టీఆర్ఎస్లో చేరానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తానని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న టీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలందరిని కలుపుకుపోతానని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పని చేసుకోవడమే ఏకైక మార్గమని పేర్కొన్నారు.
మనోభావాలు దెబ్బతింటే క్షమించాలి: మాగంటి
జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ది కోసమే టీఆర్ఎస్ లో చేరానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రకటించారు. టీడీపీ అంటే తనకెంతో గౌరవమేనని, అయితే విశ్వనగరాభివృద్ధి, బంగారు తెలంగాణ లక్ష్య సాధనకోసమే టీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేశారు. పార్టీ మారడంపై మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు.
అందరినీ కలుపుకుపోయి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతానని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలు తనకు బాగా నచ్చాయని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.
స్పీకర్ నిర్ణయం శిరోధార్యం, నో కామెంట్స్: కెటిఆర్
టీడీపీ చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో విలీనం చేయడం వెనుక తమ పాత్ర లేదని తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. విలీనంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. స్పీకర్ నిర్ణయమే శిరోధార్యమని అన్నారు.
స్పీకర్ నిర్ణయంపై కామెంట్ చేయడం సమంజసం కాదని కేటీఆర్ అన్నారు.టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ ఆధారంగా స్పీకర్ గురువారం 'విలీనం' నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ఎల్పీ సభ్యులుగా గుర్తించేందుకు అంగీకరించి, టీఆర్ఎస్ సభ్యులతో పాటు అసెంబ్లీలో సీట్ల కేటాయించారు. టీడీపీ ఎమ్మెల్యేల చేరికతో శాసనసభలో టీఆర్ఎస్ బలం 85కు పెరిగింది.