అవన్నీ ఇచ్చాం, ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్నే పిలవాలి, ఎల్లుండి ప్రమాణ స్వీకారం: గవర్నర్తో కూటమి నేతలు
హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి అధినేతలు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగలు కలిసి గవర్నర్ నరసింహన్ను కలిశామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ సీట్లు ఎవరికీ రాని సమయంలో ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలువాలనే అంశంపై సుప్రీం కోర్టు నిబంధనలు ఉన్నాయని చెప్పారు.
అందరి దృష్టి వీరిపైనే: 'లీడర్'ను దెబ్బతీస్తారా, నందమూరి సుహాసిని, బీజేపీ షెహజాదీ ప్రత్యేకం!
గతంలో పలు రాష్ట్రాల్లో జరిగిన అనుభవాల దృష్ట్యా ఇప్పుడు గవర్నర్ను కలిశామని చెప్పారు. టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, మా ఇంటి పార్టీ తదితర పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినామని చెప్పారు. తమది ఎన్నికలకు ముందు ఏర్పడిన పార్టీల కూటమిగా గవర్నర్కు చెప్పామని అన్నారు. ఇందుకు సంబంధించి వివరాలు అందించామన్నారు.
కూటమి నేతలం అందరం గవర్నర్ను కలిశాం
కూటమి నేతలం అందరం గవర్నర్ను కలిశామని ఉత్తమ్ చెప్పారు. తమది ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటమిగా రాజ్యాంగబద్ధత ఉందని చెప్పారు. గెలిచిన అభ్యర్థులకు భద్రత ఇవ్వాలని కోరామని చెప్పారు. ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన అభ్యర్థులకు రక్షణ కల్పించాలని అడిగామని చెప్పారు. తాము ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా ఉత్తమ్ ప్రకటించడం గమనార్హం.
సర్కారియా కమిషన్ అదే చెప్పింది
మహాకూటమికి మెజార్టీ వస్తుందని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం వేరుగా అన్నారు. ఒకవేళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తమ పార్టీలకు వచ్చిన వేర్వేరు సీట్లను ఒక్కటిగా చూడాలని కోరామని చెప్పారు. కూటమిని సమూహంగా చూడాలన్నారు. గతంలో సర్కారియా కమిషన్ ఇదే అంశం చెప్పిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు గవర్నర్కు అందించామని చెప్పారు.
కుమ్మక్కయ్యారని ముందే చెప్పాం
రేపటి కౌంటింగ్ పైన కమాకు పూర్తిగా నమ్మకం ఉందని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. ప్రజలు తమను ఆదరించారని తెలుస్తోందని అన్నారు. కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారని తాము ముందే చెప్పామని అన్నారు.
ఎవర్ని పిలవాలో చెప్పాం
ఒక్కొక్క పార్టీగా తమకు తెరాస కంటే తక్కువ సీట్లు వచ్చి, కూటమిగా తమకు ఎక్కువ సీట్లు వస్తే తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరామని కూటమి నేతలు చెప్పారు. ఎవరిని పిలవాలనే అంశంపై సుప్రీం కోర్టు తీర్పును గవర్నర్కు చూపించామని చెప్పారు. గవర్నర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలన్నారు.