మహబూబాబాద్ కలెక్టర్కు కరోనా పాజిటివ్.. మంత్రుల్లో టెన్షన్...
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు మంగళవారం(అగస్టు 25) కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. సోమవారం కరోనా పరిస్థితులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలువురు మంత్రులతో పాటు కలెక్టర్ గౌతమ్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్గా తేలడంతో మంత్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సమీక్ష సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియ పాల్గొన్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా ఇప్పుడు వీరంతా కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు.
కాగా,కరోనా వైరస్కు ధైర్యమే అసలైన మందు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రాజధాని హైదరాబాద్లో తగ్గుముఖం పట్టాయని తెలిపారు. కరోనా పేషెంట్లలో 99 శాతం మంది కోలుకుంటున్నారని చెప్పారు. కరోనా చికిత్సలో ప్రోటోకాల్ పాటిస్తే మరణాలకు అవకాశం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే స్కూళ్లు రీఓపెన్ చేస్తామన్నారు.
తెలంగాణలో ఇవాళ కొత్తగా 2579 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరో 9 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 108670కి చేరింది. ప్రస్తుతం 23737 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 770కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1024054 కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం దేశంలో 75.27శాతం రికవరీ ఉండగా... రాష్ట్రంలో 77.44 శాతం రికవరీ రేటు ఉంది. పడకల విషయానికొస్తే... కరోనా పేషెంట్ల కోసం 11559 ఖాళీ పడకలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 4821 ఆక్సిజన్ పడకలు,1636 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయి.