అకారణంగా బలిచేశారు.. మంత్రి కొడుకు కోసమే ఇదంతా.. కన్నీరుమున్నీరైన మహబూబాబాద్ డాక్టర్...
తెలంగాణలోని మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భీమ్ సాగర్ బదిలీ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. మంత్రి తనను మానసిక వేధింపులకు గురిచేశారని... రిటైర్మెంట్కు ఇంకా 16 నెలల సమయమే ఉండగా... అకారణంగా తనను బదిలీ చేశారని ఆరోపించారు. హఠాత్తుగా బదిలీ ఉత్తర్వులు రావడంతో ఆయన తీవ్ర మనస్తాపంతో కన్నీరుమున్నీరయ్యారు.
మంత్రి సత్యవతి రాథోడ్.. ఆమె కుమారుడి కోసమే తనను ఇలా బలి చేశారని డా.భీమ్ సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కుమారుడు కూడా ఇదే మహబూబాబాద్ ఆస్పత్రిలో ఛాతీ వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాడని చెప్పారు. అయితే నెలలో కేవలం వారం రోజులు మాత్రమే అతను ఆస్పత్రికి వస్తాడన్నారు. అయినప్పటికీ నెల రోజుల జీతం చెల్లించాలని అధికారులపై ఒత్తిడి తెస్తాడని చెప్పారు. ఆస్పత్రి సూపరింటెండెంట్గా అందుకు తాను ఒప్పుకోకపోవడంతో తనపై కక్ష కట్టారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ కాలంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న తనను బదిలీ చేయించారని ఆరోపించారు. కనీసం ప్రమోషన్ మీద పంపించినా సంతోషపడేవాడిని అని... కానీ రిటైర్మెంట్కు ఇంకా 16 నెలలే సమయం ఉండగా డిప్యూటేషన్పై హైదరాబాద్ పంపించారని వాపోయారు. నిజానికి తాను అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నానని... సూపరింటెండెంట్ పదవి కన్నా డాక్టర్గానే కొనసాగుతానని పలుమార్లు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశానన్నారు. అయినప్పటికీ తన విజ్ఞప్తిని పట్టించుకోలేదన్నారు. పని చేసేది హైదరాబాద్లో... జీతం మాత్రం మహబూబాబాద్లో... అని పేర్కొన్నారు తాను ఏ తప్పు చేయకున్నా అకారణంగా శిక్షించారని... ఏ విచారణకైనా తాను సిద్దమేనని ప్రకటించారు.