Maloth Kavitha : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు షాక్... ఆర్నెళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు గట్టి షాక్ తగిలింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఎంపీకి రూ.10వేలు జరిమానాతో పాటు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై నమోదైన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. కోర్టు విధించిన జరిమానాను కవిత చెల్లించగా... న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం.
2019 ఎన్నికల ప్రచారంలో మాలోతు కవిత డబ్బుల పంపిణీ చేశారన్న ఆరోపణలతో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటినుంచి దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం ఎంపీకి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది.
ప్రస్తుతం మాలోతు కవిత మహబూబాబాద్ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్పై ఆమె గెలుపొందారు. అంతకుముందు,2009లో కాంగ్రెస్ టికెట్పై ఆమె మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి రెడ్యా నాయక్ టీఆర్ఎస్లో చేరడంతో ఆమె కూడా అదే బాటలో పయనించారు.
ఈ ఏడాది ఏప్రిల్లో ఢిల్లీలో ఎంపీ మాలోతు కవిత పీఏల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని నుంచి రూ.5లక్షలు గుంజేందుకు ఆ ముగ్గురు యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు.దీనిపై స్పందించిన ఎంపీ కవిత ఢిల్లీలో తనకు పీఏలు ఎవరూ లేరని వివరణ ఇచ్చారు. సీబీఐ అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఒకరైన దుర్గేష్ తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నారని చెప్పారు. మిగిలిన వాళ్లెవరో తనకు తెలియదని అన్నారు.
ఇటీవలే టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు కూడా కోర్టు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తిపై దాడిచేసి గాయపరిచారన్న కేసులో 2013లో నాగేందర్పై బంజారాహిల్స్లో కేసు నమోదైంది. ఆ కేసులో నాగేందర్ను దోషిగా తేల్చిన హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు ఆయనకు రూ.1వెయ్యి జరిమానాతో పాటు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీల్కు వెళ్లేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది. అప్పటివరకూ శిక్ష అమలును నిలిపివేసింది.