మొన్న ఉత్తమ ఎమ్మార్వో.. నేడు ఉత్తమ కానిస్టేబుల్.. ఏసీబీకి చిక్కిన పోలీస్..!
మహబూబ్నగర్ : ఉత్తమ మహిళా ఎమ్మార్వో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన మరిచిపోకముందే మరో సంఘటన బయటపడింది. ఈసారి ఉత్తమ కానిస్టేబుల్గా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఓ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగుచూసింది.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న తిరుపతి రెడ్డి అనే కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వెంకటాపూర్కు చెందిన రమేశ్ అనే ఇసుక వ్యాపారి నుంచి 17వేల రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. అతడి నుంచి గత రెండేళ్లుగా ఇలాగే లంచం తీసుకుంటున్నట్లు రుజువైంది.
ఈ నెల 3వ తేదీన రమేశ్ను లంచం కోసం వేధించారు తిరుపతిరెడ్డి. ఇసుక రవాణాకు సంబంధించి ఆయన దగ్గర అన్నీ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ 17వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో రమేశ్ విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దాంతో తిరుపతి రెడ్డి రమేశ్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అదలావుంటే గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలకు గాను కానిస్టేబుల్ తిరుపతి రెడ్డి ప్రభుత్వ పురస్కారం అందుకోవడం గమనార్హం. మరునాడే ఇలా ఏసీబీ అధికారులకు పట్టుబడటం చర్చానీయాంశమైంది.