‘పిల్లలమర్రి’కి ఎంత కష్టకాలం!: కాపాడేందుకు వందలాది సెలైన్లు ఎక్కిస్తున్నారు
మహబూబ్నగర్/హైదరాబాద్: ప్రపంచంలో రెండో అతిపెద్ద, 700 ఏళ్ల క్రితం నాటి మర్రి చెట్టు 'పిల్లల మర్రి'కి కష్టకాలం వచ్చినట్లనిపిస్తోంది. చెట్లను తొలిచే పురుగుబారిన పడిన పిల్లలమర్రి తన భారీ కొమ్మలను కోల్పోయింది. దీంతో గత డిసెంబర్ నుంచి పిల్లలమర్రి సందర్శనను నిలిపేశారు.
పురుగుబారిన పడి..
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన పిల్లలమర్రిలో ఒక భాగం పురుగు బారిన పడి ఇటీవల కిందకు పడిపోయింది. ప్రమాదకరంగా పరిగణమిస్తున్న పురుగును అంతం చేసేందుకు చెట్టు మొదలుకు ఎక్కించిన రసాయనం ప్రభావం చూపలేదు.
సెలైన్ బాటిళ్ల ద్వారా..
ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా పిల్లలమర్రికి సెలైన్ల ద్వారా కీటక సంహార మందును ఎక్కిస్తున్నారు. మర్రిచెట్టు ప్రతి రెండు మీటర్లకు ఒక సెలైన్ను అధికారులు ఎక్కిస్తున్నారు. దీంతో వందల కొద్దీ సెలైన్ బాటిళ్లు చెట్టుకు వేలాడుతూ దర్శనమిస్తున్నాయి.
సందర్శన నిలిపివేత
సెలైన్ల ద్వారా ఇస్తున్న చికిత్స ప్రభావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా డిసెంబరు, జనవరి మాసాలలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మహా వృక్షాన్ని సందర్శిస్తారు. విదేశీ పర్యటకులు కూడా ఇక్కడికి వస్తుంటారు. అయితే, ఇప్పుడు పిల్లలమర్రి పురుగున బారిపడటంతో గత కొంతకాలంగా సందర్శన నిలిపివేశారు.
పిల్లలమర్రి గ్రామ విశేషాలు
కాగా, చారిత్రాత్మక పిల్లలమర్రి గ్రామాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు. ఈ దేవాలయాలలో ఉన్న శిలాశాసనాలు అప్పటి చరిత్ర తెలుపుతున్నాయి. శాలివాహన శకం 1130 (క్రీ.శ. 1208) లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు కన్నడ, తెలుగు భాషలలో వేయించిన శిలాశాసనం ఉంది. గణపతి దేవుడు కంటే మునుపు పరిపాలించిన కాకతీయ చక్రవర్తి, రుద్రదేవుడు శాలివాహన శకం 1117 (క్రీ.శ.1195) సంవత్సరములో వేయించిన శిలాశాసనం కూడా ఉంది. కాకతీయుల కాలం నాటి నాణెములు కూడా ఈ గ్రామములో లభించాయి. కాకతీయుల తరువాత పిల్లలమర్రి రేచర్ల రెడ్డి రాజులకు రాజధానిగా విలసిల్లినది. ప్రఖ్యాత తెలుగు కవి పిల్లలమర్రి పిన వీరభద్రుడు జన్మస్థలం ఈ పిల్లలమర్రి.