మమ్మల్ని రెచ్చగొడితే: కాంగ్రెస్కు సీపీఐ వార్నింగ్, కొత్తగూడెంపై బుజ్జగిస్తారా, తెగిస్తారా?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐకి మూడు సీట్లు మాత్రమే ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీసం అయిదు సీట్లు కేటాయించాలని అంటున్నారు. ప్రాధాన్యం కలిగిన తమకు ఐదు స్థానాలు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు.
Recommended Video
మళ్లీ చెప్తున్నా! వారితో మాట్లాడుతా, సీట్లు అడగకండి: టీటీడీపీ నేతలతో చంద్రబాబు
కొత్తగూడెం టిక్కెట్ ఇవ్వకుంటే.. సీపీఐ అల్టిమేటం
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం జరుగుతోంది. ఈ భేటీకి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన సీట్లపై కార్యవర్గంలో చర్చ జరిగింది. సమావేశానికి వచ్చిన కూనంనేని సాంబశివ రావు మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో సీపీఐ చాలా బలంగా ఉందని చెప్పారు. తమను రెచ్చగొడితే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని అల్టిమేటం జారీ చేశారు. తమ వల్లే ఖమ్మంలో కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలిచిందని చెప్పారు. కొత్తగూడెం సీటు సీపీఐకి ఇవ్వాల్సిందేనని చెప్పారు.
కూనంనేనిని బుజ్జగిస్తారా లేక?
కూనంనేని సాంబశివరావు కోసమే కొత్తగూడెం టిక్కెట్ను సీపీఐ డిమాండ్ చేస్తోంది. సీపీఐకి నాలుగు సీట్లు ఉండాలని, ఆ నాలుగు సీట్లలో కొత్తగూడెం కూడా ఉండాలని డిమాండ్ చేస్తోంది. సీపీఐ కార్యవర్గం భేటీ నేపథ్యంలో వారు కూనంనేనిని బుజ్జగిస్తారా లేక కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేస్తారా చూడాల్సి ఉంది. మొత్తానికి నాలుగు సీట్ల విషయంలో మాత్రం తగ్గడం లేదు.
బెల్లంపల్లికి నో, మంచిర్యాల కోసం పట్టు
సీబీఐకి మూడు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ టిక్కెట్లు ఇస్తామని తెలిపింది. అయితే సీపీఐ దేవరకొండ, కొత్తగూడెం సీట్ల కోసం పట్టుబడుతోంది. సీపీఐ ముఖ్యంగా హుస్నాబాద్, కొత్తగూడెం సీట్లను మొదటి నుంచి కోరుతోంది. ఇందులో హుస్నాబాద్ టిక్కెట్ ఇస్తోంది. కొత్తగూడెం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అలాగే బెల్లంపల్లి సీటుకు సీపీఐ నో చెబుతోంది. దానికి బదులు మంచిర్యాల టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ మూడు సీట్లకు మరొకటి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తోంది.
ఈ సీట్లపై కాంగ్రెస్లో పోటాపోటీ
కాగా, కూటమి సీట్లను కాంగ్రెస్ పార్టీ గురువారం తేల్చేసిన విషయం తెలిసిందే. ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్ 93 స్థానాల్లో, టీడీపీ 14 స్థానాల్లో, తెలంగాణ జన సమితి 8 స్థానాల్లో, సీపీఐ 3 స్థానాల్లో, తెలంగాణ ఇంటి పార్టీ 1 స్థాన్లో పోటీ చేయనుంది. అయితే సీపీఐ తమకు వచ్చిన సీట్లపై తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపు 74 మంది ఖరారు అయ్యారు. కేవలం పదిపదిహేను స్థానాల్లో మాత్రం గట్టి పోటీ ఉంది. మునుగోడి, పటాన్చెరు, మంచిర్యాల, సూర్యాపేట, ఇల్లందు, నాగర్ కర్నూలు, తుంగతుర్తి, దేవరకొండ, బోథ్, అదిలాబాద్, ఎల్లారెడ్డి, నారాయణఖేడ్ తదితర స్థానాల్లో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది.