టీఆర్ఎస్ గ్రాఫ్ 60 నుంచి 30కి పడిపోయింది: కేసీఆర్పై మహా కూటమి నిప్పులు
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మహాకూటమి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ.. కేసీఆర్ కుటుంబం చేతుల్లో చిక్కుకుందని ఆరోపించారు.
కేసీఆర్ పాలనకు చరమగీతం
నాగోల్లోని బండ్లగూడలో జరిగిన ఓ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, తెలంగాణ జన సమతి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొని కేసీఆర్ అణచివేత ధోరణిని ఎండగట్టారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని ఉత్తమ్ విమర్శించారు.
టీఆర్ఎస్ గ్రాఫ్ ఊహించని విధంగా పడిపోయింది
ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఆరు శాతం కమీషను కేసీఆర్ కుటుంబమే తీసుకుంటోందని, తాను అధికారికంగా ఈ విషయం చెబుతున్నానని ఉత్తమ్ అన్నారు. కేవలం 45 రోజుల్లోనే ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ గ్రాఫ్ 60 నుంచి 30 సీట్లకు పడిపోయిందని ఎల్ రమణ వ్యాఖ్యానించారు.
అంతా కలిసి వెళ్లాలనే..
సమాజ హితం కోరినప్పుడే విలువ పెరుగుతుందని, టీఆర్ఎస్ పాలనలో అది కొరవడిందని కోదండరాం అన్నారు. పొత్తుల విషయంలో అంతా కలిసి ముందుకెళ్లాలని ప్రజల నుంచి తమపై ఒత్తిడి వస్తోందని ఆయన చెప్పారు. కేసీఆర్ నిరంకుశ పాలన తిరిగి రాకుండా చూడాలని ప్రజాస్వామికవాదులంతా బలంగా కోరుకుంటున్నారన్నారు.
విభేదాలు వచ్చినా కూటమిగానే..
సీట్ల విషయంలో చిన్నపాటి విభేదాలు వచ్చినా పొత్తుతోనే ముందుకెళ్తామని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ సిద్ధిస్తే ఉద్యమంలో కీలకపాత్ర పోషించినవారికి పాలనలో భాగస్వామ్యం లభిస్తుందని భావించామని, కానీ ఉద్యమంతో సంబంధం లేని వారికి పదవులు దక్కాయని చాడ వెంకటరెడ్డి విమర్శించారు.
కుట్ర జరుగుతోంది..
మరో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టీటీటీడీపీ సీనియర్ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వస్తున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు మహాకూటమిగా పోటీచేయడం అవసరమని ఆయన అన్నారు. టీడీపీ పార్టీ తెలంగాణలో ఉండకూడని కుట్ర జరుగుతోందని, ఈ పార్టీ తెలంగాణలో ఎందుకని అంటున్నారని టీఆర్ఎస్పై మండిపడ్డారు. టీఆర్ఎస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు హర్షించడంలేదని, రాజ్యాంగ వ్యవస్థని భ్రస్టు పట్టిస్తోందన్నారు. రాష్ట్రంలో నీరు లేకపోయినా, మద్యం ఏరులై పారుతోందని రావుల విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన తెలంగాణ టీటీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, కూటమి చర్చలు తదితర అన్ని విషయాలు చంద్రబాబుకు వివరించామని రావుల తెలిపారు.