లగడపాటి సర్వే తెరాసకు గడ్డుకాలం, ఓటింగ్ పెరిగితే కూటమి క్లీన్స్వీప్, బీజేపీకి పెరగనున్న సీట్లు
హైదరాబాద్: ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తన సర్వే ఫలితాలను మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మరో ముగ్గురు గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు చెప్పారు. మరోవైపు ఓటింగ్ శాతం పెరిగితే కూటమికి అవకాశముంటుందని, తగ్గితే హంగ్ వచ్చే అవకాశమని చెప్పారు.
నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి, బోథ్ నుంచి అనిల్ జాదవ్ గెలుస్తారని ఇప్పటికే చెప్పానని, ఇప్పుడు మరో మూడు పేర్లు చెబుతున్నానని అన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి వినోద్ గెలుస్తారని చెప్పారు.
2014లో నా సర్వే ఫలితాలు నిజమయ్యాయి
2014లో తాను చెప్పిన సర్వే ఫలితాలు నిజమయ్యాయని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు వస్తారని అప్పుడు చెప్పానని అన్నారు. అలాగే పలు ఉప ఎన్నికల్లో కూడా తాను చెప్పిన సర్వే ఫలితాలు నిజమయ్యాయని చెప్పారు. ప్రస్తుతం తనకు ఏ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. తాను చంద్రబాబును, కేసీఆర్లను కలిశానని, కానీ పార్టీలతో మాత్రం సంబంధం లేదన్నారు.
దుమారం చెలరేగింది అందుకే ఆగాను
తాను ఇటీవల తిరుపతికి వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు తన సర్వే గురించి అడిగారని లగడపాటి చెప్పారు. సర్వే గురించి మీడియా ప్రతినిధులు అడిగితేనే తాను ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల పేర్లు చెప్పానని అన్నారు. కానీ తాను స్వతంత్ర అభ్యర్థుల పేర్లు చెబితేనే పెద్ద దుమారం చెలరేగిందన్నారు. నేను ఇండిపెండెంట్ల పేర్లు చెబితేనే విమర్శలు రావడంతో ఆ తర్వాత చెప్పలేదన్నారు. వివాదం చెలరేగడంతో పేర్లు చెప్పడం ఆపేశానని అన్నారు.
ఓడిపోయే వారిలో నా స్నేహితులు
కొందరు ఓడిపోయే వారు కూడా ఉన్నారని, అందులో తన సన్నిహితులు కూడా ఉన్నారని చెప్పారు. కానీ ఓడిపోయే వారి గురించి తాను చెప్పడం లేదన్నారు. ఓడిపోయే వారి గురించి చెప్పవద్దని వారు తనకు విజ్ఞప్తి చేశారని అన్నారు. తాను చెప్పినప్పుడు ఎనిమిది మంది స్వతంత్రులు గెలుస్తారని తెలిపారు. మిగతా ఫలితాలను తాను 7వ తేదీన సాయంత్రం చెబుతానని అన్నారు.
పోలింగ్ శాతం పెరిగితే కూటమి, తగ్గితే హంగ్
ఈసారి ఎన్నికలు పోటీపోటీగా జరుగుతాయని లగడపాటి చెప్పారు. వన్ సైడ్ జరిగే ఎన్నికలు కాదని చెప్పారు. ఈ విషయం అన్ని గ్రామాల్లోను తెలుసునని చెప్పారు. తెలంగాణలో ఈసారి పోలింగ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఆసక్తికరమని చెప్పారు. ఓటింగ్ పెరిగితే ఫలితం ఓ రకంగా, తగ్గితే మరో రకంగా ఉంటుందని చెప్పారు. పోలింగ్ సరళి కూడా ఫలితాలను మార్చివేస్తాయని చెప్పారు. ఈసారి పోలింగ్ శాతం పెరిగితే మహాకూటమికి అవకాశం ఉంటుందని, పోలింగ్ శాతం తగ్గితే మాత్రం హంగ్కు అవకాశం ఉంటుందని లగడపాటి చెప్పారు. యథాతథంగా ఉంటే ఎవరు వస్తారో చెప్పలేమని అన్నారు.
బీజేపీకి సీట్లు పెరుగుతాయి
బీజేపీకి గతంలో వచ్చిన సీట్ల కంటే అధికంగా వస్తాయని లగడపాటి చెప్పారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఏడో తేదీన సాయంత్రం చెబుతానని అన్నారు. బీజేపీ గతంలో కలిసి పోటీ చేసిందని, ఇప్పుడు సింగిల్గా పోటీ చేసినప్పటికీ పెరుగుతాయని చెప్పారు. హైదరాబాదులో మాత్రం బీజేపీకి సీట్లు పెరుగుతాయని చెప్పారు. బీజేపీకి జిల్లాల్లో సీట్లు వస్తాయని చెప్పారు.
ఏడున విషయం చెబుతా
ఈ సందర్భంగా ఏ జిల్లాల్లో ఏ పార్టీ లేదా ఏ కూటమి ఆధిక్యం సాధిస్తుందో కూడా లగడపాటి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగు జిల్లాల్లో (ఉమ్మడి) ప్రజాకూటమి ఆధిక్యంలో ఉంటుందని చెప్పారు. మూడి జిల్లాల్లో టీఆర్ఎస్, రెండు జిల్లాల్లో పోటా పోటీ ఉంటుందని చెప్పారు. ఓటింగ్ ఎక్కువగా ఉంటే ప్రస్తుత జననాడి ప్రకారం ప్రజా కూటమిదే విజయమని అభిప్రాయపడ్డారు. అయితే గతంలో వచ్చినట్లు 68.5 శాతం ఓటింగ్ జరిగితేనే అని, ఓటింగ్ అటు ఇటు అయితే ఫలితాలు కూడా తారుమారు అవుతాయని చెప్పారు. యథాతథంగా పోలింగ్ శాతం ఉంటే ఫలితం ఎలా ఉంటుందో 7వ తేదీన చెబుతానని అన్నారు.
ఏ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని గెలుస్తుందంటే?
ఖమ్మం, అదిలాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధిస్తుందని లగడపాటి తన సర్వే ఫలితాలను వెల్లడించారు. అలాగే వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో తెరాస ఆధిక్యం ఉంటుందని చెప్పారు. కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పోటీ పోటీ ఉంటుందని చెప్పారు. హైదరాబాదులో అత్యధికం మజ్లిస్ గెలుచుకుంటుందని, మిగిలిన సీట్లలో బీజేపీ, కాంగ్రెస్, తెరాస గెలుస్తుందని చెప్పారు. అయితే ఈ రెండు రోజుల్లో కూడా మార్పులు చేర్పులు జరగవచ్చునని, కాబట్టి 7న ఓటింగ్ శాతాన్ని బట్టి కచ్చితమైన ఫలితాలు చెబుతానని అన్నారు.