సినిమాలకు రాయితీ, జీఎస్టీలోకి పెట్రోల్: రేపే కూటమి సీఎంపీ, 'టీఆర్ఎస్కు వచ్చే సీట్లు 35'
హైదరాబాద్: మహాకూటమి మంగళవారం నాడు తమ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఈపీసీ విధానం రద్దు, పెద్ద ప్రాజెక్టులకు ఒకే బడా కాంట్రాక్టర్, స్థానికులకే కాంట్రాక్టులు, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత, తొలి, మలి దశ ఉద్యమకారులకు పెన్షన్ వంటి పలు అంశాలను పొందుపర్చారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు, తెరాస హయాంలో జరిగిన భూసేకరణపై సమీక్ష, పెండింగ్ భూసేకరణపై 8 నెలల మారటోరియం, ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం, సకాలంలో ఫీజు రీయింబర్సుమెంట్స్, తెరాస హయాంలో జరిగిన అవినీతిపై విచారణ వంటి అంశాలను కూడా పొందుపర్చారు.
తెలంగాణ సినిమాలకు రాయితీ, జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్
అలాగే, తెలంగాణ యాస, భాష పరిరక్షణ కోసం యూనివర్సిటీ, తెలంగాణ నేపథ్యంలో తీసే సినిమాలకు రాయితీ, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు నిజాం షుగర్స్, సిర్పూర్ కాగజ్ నగర్ ఫ్యాక్టరీలు తెరిపించడం, జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ఉత్పత్తులు, దివ్యాంగులకు ప్రత్యేక శాఖ, సింగరేణి, ఆర్టీసీ రిటైర్డ్ బీపీఎల్ కుటుంబాలకు పింఛన్ తదితర అంశాలను ప్రజా కూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రాం (సీఎంపీ)లో పొందుపర్చారు.
రేపు ముసాయిదా ప్రకటన
మహాకూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై ముసాయిదా సిద్ధం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కూటమి పక్షాలు తమ ముసాయిదాను తమకు అందించాయని చెప్పారు. సీపీఐ కూడా కొన్ని అంశాలను సూచించిందని తెలిపారు. రేపు (మంగళవారం) కూటమి ముసాయిదాను ప్రకటిస్తామని తెలిపారు.
సీఆర్ వద్ద హరీష్ జాతకం, ఆ రోజు వీడియో బయటపెట్టు: రేవంత్ కీలక వ్యాఖ్యలు
చివరి బీఫాం తీసుకునే వ్యక్తిని నేను
కామన్ మ్యాన్, కర్షకులకు అండగా ముసాయిదా ఉంటుందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల సమస్యలకు ముసాయిదాలో చోటు కల్పించామని చెప్పారు. కూటమిపై ప్రజల్లో గౌరవప్రదమైన అభిప్రాయం ఉందని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. తెలంగాణ టీటీడీపీలో చివరి బీఫాం తీసుకునే వ్యక్తిని తానే అన్నారు. ఎన్టీఆర్ భవన్లో తీసుకునే నిర్ణయమే ఫైనల్ అన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి సముచితస్థానం ఉంటుందన్నారు. మోడీ, అమిత్ షా, కేసీఆర్ లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీలో అణగారిన వర్గాలకే అవకాశాలు అని చెప్పారు. కేసీఆర్ పాలనలో మొత్తం తెలంగాణ దోపిడీకి గురయిందని ఆరోపించారు. తెరాసకు వచ్చే సీట్లు 25 నుంచి 35 మాత్రమే అన్నారు. ప్రజాకూటమి లక్ష్యం కోసం రావుల, తాను పోటీ చేయడం లేదని చెప్పారు. కేసీఆర్ అప్రజాస్వామికంగా పాలించారన్నారు.
కేసీఆర్ కుటుంబం ఓవైపు, ప్రజలు మరోవైపు
అందరం చర్చించుకొని రేపు ముసాయిదాను ప్రకటిస్తామని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం చెప్పారు. ఉమ్మడి ప్రణాళికలోని అంశాలే ప్రచార అస్త్రాలు అని చెప్పారు. కేసీఆర్ కుటుంబం ఒక వైపు ఉంటే, ప్రజలు మరోవైపు ఉన్నారని చెప్పారు.