పొత్తుపై కాంగ్రెస్లో రుసరుస: రంగంలోకి తెలుగుదేశం, కూటమిలో కుదిరిన సీట్ల లెక్క
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి పొత్తులపై కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పొత్తులపై నంది ఎల్లయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎవరిని అడిగి పొత్తులు ఖరారు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కనీసం ఎంపీలకు సమాచారం ఇవ్వకుండా ఎలా ముందుకెళ్తున్నారని అడిగారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు ఈ పొత్తులు పెట్టుకుంటున్నారా లేక ఓడిపోయేందుకా అని నిలదీశారు. గెలిచే సీటన్నీ మిత్రపక్షాలకు ఇచ్చి ఓడిపోయే స్థానాలు తీసుకుందామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిక్కెట్లపై ఎక్కువ ఆశలొద్దు.. 18సీట్లతో సర్దుకుపోదాం, కాంగ్రెస్ గెలుపు ముఖ్యం!: బాబు షాకింగ్
నంది ఎల్లయ్య ప్రశ్నలకు ఉత్తమ్ సమాధానం
దీనిపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. అధిష్టానం ఆదేశాల ప్రకారమే పొత్తులు అని చెప్పారు. మిత్ర పక్షాలకు 20 నుంచి 25 సీట్లు వెళ్తాయని తెలిపారు. 90కి పైగా స్థానాల్లో మనం పోటీ చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో టిక్కెట్ కోసం 5వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పొత్తుల వల్ల సీట్లు నష్టపోతే బాధపడవద్దని, అధికారంలోకి వచ్చాక అందరికీ ప్రాధాన్యం ఉంటుందని ఉత్తమ్ చెప్పారు. రాహుల్తో నిరుద్యోగుల భారీ సభను ఏర్పాటు చేయాలని మరో కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు అన్నారు. తన ప్రచార సభలకు కార్యకర్తలు మాత్రమే వస్తున్నారని చెప్పారు. నాయకులు మాత్రం సహకరించడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. పొత్తులపై త్వరగా తేల్చాలన్నారు.
కూటమిలో తేలిన సీట్లు
ఇదిలా ఉండగా, మహాకూటమిలో పొత్తు కుదిరినట్లుగా తెలుస్తోంది. అన్ని పార్టీలూ పట్టువిడుపులను ప్రదర్శించడం, ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీల అధిష్ఠానాలు రంగంలోకి దిగి నెగ్గాలంటే తగ్గాలన్న సూత్రాన్ని పాటించడంతో సమస్య సద్దుమణిగింది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లలో పోటీ చేయనుంది. మిత్రపక్షాల్లో టీడీపీకి 15, టీజేఎస్కు 10, సీపీఐకి 4 స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించగా, అందుకు మిగతా పార్టీలు కూడా సమ్మతించాయని తెలుస్తోంది.
కూటమి అంతా ఏకతాటిపై
సీట్ల సంఖ్యపై నేడో రేపో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. తద్వారా కేసీఆర్కు, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కూటమి అంతా ఏకతాటిపై ఉందని చెప్పనున్నారు. అదే సమయంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు రానున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. పలు సర్వేల ఆధారంగా ప్రతి సీటు నుంచి బలమైన అభ్యర్థులనే ఎంపిక చేయాలని అన్ని పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయని తెలుస్తోంది.
ఎవరికి ఎన్ని సీట్లు అంటే?
మహాకూటమి తొలి జాబితాలో 60 మంది పేర్లు వెల్లడి కావొచ్చునని తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున 40 నుంచి 50 మంది పేర్లు, టీడీపీ నుంచి 8, టీజేఎస్ నుంచి 5, సీపీఐ నుంచి ఇద్దరి పేర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. జాబితాలో 35 బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉండేలా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కూటమి పాటుపడుతుంది
కూటమి, పొత్తులు, సీట్లపై తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ... కేసీఆర్ అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడేందుకే మహాకూటమి ఏర్పడిందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని, పార్టీల వారీగా సంఖ్యను ఆనుకొని మూడు విడలుగా కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. టీడీపీ ఆంధ్రా పార్టీ అని టీఆర్ఎస్ నేతలు అనడాన్ని ఆయన ఖండించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల్లో ఆయన చిరస్థాయిగా నిలిచే నాయకుడు అన్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదరాబాద్, ఖమ్మం, ఇంకొన్ని చోట్ల నిర్వహించే సభల్లో చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు తమ కూటమి పాటుపడుతుందని చెప్పారు.