ఆ సీట్లపై ఫైట్: రంగంలోకి రాహుల్గాంధీ, తెలంగాణ నేతలపై అసహనం, రేవంత్ రెడ్డికి పిలుపు
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు కాకపోవడంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణ టీడీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన ఇప్పటి వరకు అభ్యర్థులు, నియోజకవర్గాలు కొలిక్కి రాకపోవడం ఆయనను తీవ్ర అసహనానికి గురి చేసిందని తెలుస్తోంది.
వార్ వన్ సైడేనా?: మహాకూటమి వైపు తాజా జాతీయ సర్వే, టిక్కెట్ల కోసం రచ్చరచ్చ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ కుంతియాలు అధినేతతో సోమవారం రెండుసార్లు భేటీ అయ్యారు. కూటమిలో పొత్తులు, మిత్రపక్షాలకు సీట్లు, ఏయే సీట్లు ఇవ్వాలనే అంశాలపై ఆయనతో చర్చించారు. ఎక్కువ నియోజకవర్గాలు కొలిక్కి వచ్చాయి. పది నుంచి ఇరవై నియోజకవర్గాల మధ్య పట్టు కొనసాగుతోందని తెలుస్తోంది.
రాహుల్ గాంధీ చేతికి కూటమి వ్యవహారం
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేతికి మహాకూటమి సమస్యల పరిష్కారాన్ని అప్పగించారని తెలుస్తోంది. కూటమి సర్దుబాటు వ్యవహారం బాధ్యతలను ఆయనకు అప్పగించారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సెంట్రల్ కమిటీ నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో బిజీగా ఉంది. దీంతో రాహుల్ గాంధీ కూటమి సర్దుబాటుపై దృష్టి సారించనున్నారు.
అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి బయలుదేరుతున్నారు. గత ఏడాది పలువురు మద్దతుదారులతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో పలువురికి టిక్కెట్ల విషయంలో హామీ ఇచ్చారు. కానీ అందులో పలువురికి టిక్కెట్లు రావడం లేదని తెలుస్తోంది. దీంతో రేవంత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనతో చర్చించేందుకు పిలుస్తోందని తెలుస్తోంది. అదే సమయంలో సీట్ల లెక్క తెగకపోవడం వల్ల కూటమిలో సర్దుబాటు అంశంపై కూడా చర్చించేందుకు పిలిచినట్లుగా తెలుస్తోంది.
జాబితాపై కసరత్తు
మహాకూటమిలో సీట్ల అంశం ఓ కొలిక్కి రావడం లేదు. వీటిపై చర్చించేందుకు రాహుల్ గాంధీతో కుంతియా, ఉత్తమ్లు రెండుసార్లు భేటీ అయ్యారు. అభ్యర్థుల జాబితా విడుదల చేయడంపై కసరత్తు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసమే రేవంత్ రెడ్డిని కూడా పిలిచారని తెలుస్తోంది.
టీడీపీతో ఈ సీట్లపై తెగని పంచాయతీ
మహాకూటమిలో భాగంగా సీట్ల పైన ఎక్కువగా టీడీపీ సీట్ల పైనే స్పష్టత వచ్చింది. 14 సీట్లకు గాను పది సీట్లు దాదాపు ఖరారయ్యాయి. సత్తుపల్లి, అశ్వారావుపేట, ఖమ్మం, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మక్తల్, మహబూబ్నగర్, వరంగల్ వెస్ట్, రాజేంద్రనగర్, ఉప్పల్ స్థానాలను టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. నాలుగింటి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఎల్బీ నగర్, సనత్ నగర్, జూబ్లీహిల్స్లను కూడా టీడీపీ డిమాండ్ చేస్తోంది. జూబ్లీహిల్స్కు బదులు ఖైరతాబాద్, సనత్ నగర్కు బదులు సికింద్రాబాద్, ఎల్బీనగర్కు బదులు ఇబ్రహీంపట్నం ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దీనికి టీడీపీ నో చెబుతోంది. అదే విధంగా నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానం కోరుతోంది. బాల్కొండ, బాన్సువాడ, నకిరేకల్, ఆలేరులను టీడీపీ కోరుతోంది.