కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పిన జైపాల్ రెడ్డి, సీఎం రేసులో లేనని వ్యాఖ్య
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, తాను మంత్రి (ఆపద్ధర్మ) కేటీ రామారావును నాయకుడిగానే గుర్తించనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు.
నందమూరి సుహాసినికి గట్టి షాక్, తెరాసలో చేరిన కూకట్పల్లి కీలక నేత: కారణం ఇదీ
తెరాసకు ఓటమి తప్పదు, 75 సీట్లు గెలుస్తాం
ముందస్తు ఎన్నికలకు పోయిన తెరాసకు ఓటమి తప్పదన్నారు. 1971లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఇందిరాగాంధీ మాత్రమే గెలిచారని, ఆ తర్వాత అలా చేసిన వారు ఎవరూ గెలవలేదని చెప్పారు. తమ పార్టీ 75 స్థానాలకు పైగా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్కు ఓటేస్తే మోడీకి వేసినట్లే
బీజేపీతో తెరాసకు లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో కేసీఆర్ బలహీన అభ్యర్థులను నిలబెట్టారని జైపాల్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్కు ఓటు వేస్తే నరేంద్ర మోడీకి వేసినట్లే అన్నారు. ఇక్కడ తెరాసను, వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్నారు. కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు.
కేటీఆర్ను నేను నాయకుడిగానే గుర్తించను
కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తారా అని మంత్రి (ఆపద్ధర్మ) కేటీఆర్ సవాల్ చేశారని, అసలు ఆయనను తాను ఎప్పటికీ నాయకుడిగా గుర్తించనని చెప్పారు. కేసీఆర్ సవాల్ చేస్తే నేను స్పందిస్తానని అన్నారు. తనకు మెదడు పనిచేయడం లేదని కేసీఆర్ విమర్శించారని, అలా తనపై ఎన్ని విమర్శలు చేసినా ఖండించనని చెప్పారు.
నేను సీఎం రేసులో లేను
ప్రజా కూటమిలోని పార్టీలు విడివిడిగా మేనిఫెస్టోలు ప్రకటించినా ఎన్నికల్లో ఉమ్మడి అజెండాతో ముందుకు వెళ్తామని, టీడీపీతో పొత్తు ఉన్నా తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణలో ఏపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని జైపాల్ రెడ్డి చెప్పారు. కూటమి తరఫున తాను సీఎం రేసులో లేనని ఆయన చెప్పారు. తమ కూటమి అధికారంలోకి వచ్చాక సీఎంగా ఎవరున్నా నైతికంగా వెనకుండి నడిపిస్తానని చెప్పారు. కూటమి కాకుండా కాంగ్రెస్ పార్టీకే 75 సీట్లు వస్తాయని చెప్పారు.