కేసీఆర్ రాజకీయం మాట్లాడితే సరి, లేదంటే: బాబు ఆగ్రహం, ఏపీలో కాంగ్రెస్తో పొత్తుపై..
అమరావతి/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేసీఆర్! నీ ప్రకటనతో మేం 40 స్థానాల్లో గెలుపు స్టార్ట్ చేశాం: గెలుపు ఈజీ అంటూ రేవంత్ రెడ్డి లెక్క
తెరాస అధినేత కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే ఓకేనని, కానీ వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధానం సరికాదని, దానిని ఉపేక్షించేది లేదన్నారు. చంద్రబాబు ఉండవల్లిలో పలువురు నేతలతో భేటీ అయ్యారు. ఫరూక్, కిడారి శ్రవణ్లను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేతలతో మాట్లాడారు.
అందుకే కూటమి
కేసీఆర్ను ఎదుర్కొనేందుకే టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో ఒక అడుగు వెనక్కి తగ్గి, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా మహాకూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. అన్యాయం జరిగినప్పుడు టీడీపీలా పోరాడేది దేశంలో ఎవరూ లేరన్నారు.
ఏ స్థాయిలో ఉన్నా వినయం అవసరం
రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్నా వినయం అవసరమని చంద్రబాబు చెప్పారు. నాయకుడు అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. తాను సర్పంచిని, ఎంపీటీసీని, మంత్రిని, పెత్తందారీ వ్యవస్థ నడుపుతానని, తన మాటే చెల్లాలంటే ఆ రోజుకు బాగున్నా ప్రజలు సమయం చూసి దెబ్బతీస్తారని చెప్పారు.
ఛాయ్ వాలా అన్నారు.. మోడీకి హంకారం
తాను ఛాయ్వాలానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ప్రధాని అవుతూనే ఎక్కడా లేని అహంకారం వచ్చిందని, తనను వ్యతిరేకించిన వారిని అణగదొక్కుతున్నారని, మనకు అన్యాయం చేశారని, ధర్మంగా వ్యవహరిస్తే అది మనల్ని కాపాడుతుందని, అధర్మమైతే ఎప్పటికైనా నష్టమేనని చంద్రబాబు చెప్పారు. దేశంలోని ప్రధాన పార్టీలు, ముఖ్య నేతలు అందరూ కలిసి నడిచేందుకు ముందుకు వచ్చారని చెప్పారు.
ఏపీలో కలిసి పని చేసే అంశంపై చర్చించి నిర్ణయం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రచారం చేయడంపై చంద్రబాబు వేరుగా స్పందించారు. ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో ఎలా కలిసి వెళ్తామనే చర్చ కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ భేటీలో జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా మా ఎంపీలు పార్లమెంటులో నిరసన తెలిపారని, మోడీ హయాంలో అలాంటి అవకాశం కూడా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అప్పుడు ఎవరిపై ఐటీ దాడులు జరగలేదని, ఇప్పుడు బీజేపీని ప్రశ్నిస్తే మా ఇద్దరు ఎంపీలు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై దాడులు జరిగాయని, ఇదే ప్రజాస్వామ్యానికి డేంజర్ అన్నారు. ఏపీలో కలిసే అంశంపై, తెలంగాణలో కలిసి ప్రచారం చేసే అంశంపై చర్చించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.