చంద్రబాబు వెళ్లిపోయేలా చూడాలని అల్లాను ప్రార్థించా: డిప్యూటీ సిఎం
నల్లగొండ: తెలంగాణకు పట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాకా చంద్రబాబు నాయుడి గ్రహణం వీడాలని అల్లాను ప్రార్థిస్తున్నానని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. బంగారు తెలంగాణకు బాబు అవరోధంగా మారారని అన్నారు.
అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబు తక్షణమే రాష్ట్రం విడిచి పోయేలా చూడాలని అల్లాను వేడుకుంటున్నానని డిప్యూటీ సీఎం అన్నారు. నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని మసీద్ల మరమ్మతు కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.55 లక్షల చెక్కులను యాదగిరిగుట్టలో సోమవారం అందజేసి మాట్లాడారు.
రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందుకు సాగుతుం డగా, అనేక అడ్డంకులు సృష్టిస్తూ రాష్ర్టాభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రం విడిచి పోతే హర్షిస్తామని అన్నారు.
తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం అవుతుందన్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.