బీఫ్, పోర్క్ ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండి: డిప్యూటీ సిఎం
హైదరాబాద్: బీఫ్, పోర్క్ ఏమైనా తినండి గానీ ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 10వ తేదీన ఓ వర్గం విద్యార్థులు తలపెట్టిన బీఫ్ పెస్టివల్, పోర్క్ ఫెస్టివల్ రగడపై ఆయన బుధవారంనాడు స్పందించారు.
విశ్వవిద్యాలయంలో రాజకీయాలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. కాగా, విశ్వవిద్యాలయంలో బీఫ్ పెస్టివల్కు గానీ గోపూజలకు గానీ అనుమతి లేదని ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు స్పష్టం చేశారు.
విశ్వవిద్యాలయం ఉన్నది చదువు, పరిశోధన కోసమని, రాజకీయాలు చేయడానికి కాదని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని మహమూద్ అలీ అన్నారు. విశ్వవిద్యాలయంలో ఒక వర్గం విద్యార్తులు ఈ నెల 10వ తేదీన బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడానికి సిద్ధం కావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ప్రపంచ మానవ హక్కుల దీనోత్సవం రోజున.. మానవ హక్కులను పరిరక్షించుకునేందుకు తాము బీఫ్ ఫెస్టివెల్ నిర్వహిస్తున్నామని బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించే విద్యార్థులు చెబుతున్న విషయం తెలిసిందే. తాము దాదాపు పదివేల మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని చెప్పారు.
మధ్యాహ్నం పన్నెండు గంటలకు బీఫ్ ఫెస్టివెల్ ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని చెప్పారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీహార్ సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులను ఆహ్వానిస్తున్నామన్నారు.