మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
హైదరాబాద్: మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ మండలం భాబాలీ గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసి సర్పంచ్ తోపాటు అన్ని వార్డులలో కూడా విజయం సాధించారు. వీరంతా కూడా గతంలో టీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉండటం గమనార్హం.
గతంలో తమ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్ను కోరిన విషయం తెలిసిందే. కేసీఆర్ సర్కారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఈ గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. అందుకే తాము కూడా తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కాగా, మహారాష్ట్రలోని 34 జిల్లాల్లోగల 14,234 గ్రామపంచాయితీలకు గత వారం ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. బ్యాలెట్ పద్ధతిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం, కొవిడ్ ప్రొటోకాల్ కారణంగా కౌంటింగ్ నిదానంగా సాగుతోంది. రాత్రి 10 గంటల వరకు 12, 503 పంచాయితీల్లో లీడ్లు వెలవడ్డాయి. ఆ లెక్కల ప్రకారం..
Recommended Video
ఇప్పటివరకు వెల్లడైన సమాచారం ప్రకారం మహారాష్ట్రలోని మొత్తం 14,234 పంచాయితీలకుగానూ, 2,912 చోట్ల బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ముందంజలో లేదా విజయం సాధించారు. 2,724 పంచాయితీల్లో శివసేన అభ్యర్థులు లీడ్ లేదా గెలుపు సాధించారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ బలపర్చిన అభ్యర్థులు 2,673 పంచాయితీల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 1905 పంచాయితీలను కైవసం చేసుకునే దిశగా వెళుతున్నారు. 2,289 పంచాయితీల్లో ఇతర పార్టీల అభ్యర్థులు లేదా ఇండిపెండెంట్లు ప్రభావం చూపించారు.