ఒక్కోదానికి కేంద్రం రూ.కోటి సాయం: ఢిల్లీలో తెలంగాణ మంత్రి (పిక్చర్స్)
ఢిల్లీ: నష్టాల్లో నడుస్తున్నా భవిష్యత్లో తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ రోడ్డు రవాణా సదస్సు, ఎగ్జిబిషన్ను కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో గురువారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ అమలు తీరు, ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణ విధానాలు, ఆధునిక పరిజ్ఞాన వినియోగం, ప్రయాణికుల భద్రత తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చ జరిగింది.
అనంతరం మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద గతంలో కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలు లక్ష్యంగా కొన్ని బస్సులు మంజూరు చేసిందని కానీ, గ్రామీణ ప్రాంతాలకు మాత్రం ఇలాంటి పథకమేదీ లేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాలకు కూడా బస్సులను అందించడంపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించామని తెలిపారు.
మహేందర్ రెడ్డి
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రస్తుతం డీజిల్తో నడుస్తున్న పట్టణ సర్వీసులు, కొన్ని ఎంపిక చేసిన సర్వీసులను ఇకపై బ్యాటరీతో నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం విమానాశ్రయాల నిర్వహణ జరుగుతున్న విధంగా భవిష్యత్తులో బస్సు స్టేషన్ల నిర్వహణను చేపట్టడంపై దృష్టి సారించామన్నారు.
మహేందర్ రెడ్డి
రెండు నెలల క్రితం ఢిల్లీ శివారు ప్రాంతంలో ఉన్న ఒక శిక్షణా కేంద్రాన్ని పరిశీలించామని, దీని స్ఫూర్తిగా రూ.20 కోట్ల ఖర్చుతో సిరిసిల్లలో నెలకొల్పుతున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో ఇలాంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు.
మహేందర్ రెడ్డి
ఒక్కో కేంద్రానికి రూ.కోటి చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చిందన్నారు. స్వయంగా మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయం చెప్పారని మహేందర్ రెడ్డి చెప్పారు.
మహేందర్ రెడ్డి
ఆర్టీసీలో రెండు రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజన దాదాపుగా పూర్తయిందని, మరో రెండు నెలల్లో ఆస్తులు, అప్పుల విభజన కూడా పూర్తవుతుందన్నారు.