మహేష్బాబు తల్లి ఇందిరాదేవి మరణం.. చంద్రబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, బండి సంజయ్ సంతాపం
సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. దీంతో మహేష్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవలే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన చోటుచేసుకోగా తాజాగా మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కూడా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదం లో ముంచేసింది. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
కృష్ణ, మహేష్ బాబు కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రముఖ నటులు కృష్ణ గారి సతీమణి, మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇందిరా దేవి మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మానసిక శక్తిని కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని చంద్రబాబు వెల్లడించారు.
వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలి: పవన్ కళ్యాణ్
మరోవైపు ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి , మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని వెల్లడించారు. ఈ బాధ నుండి కృష్ణ గారు, మహేష్ బాబు గారు త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనలో తెలిపారు.
ఇందిరాదేవి మరణవార్త మనసును కలచివేసింది: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కూడా కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసిందని చిరంజీవి వెల్లడించారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని సూపర్ స్టార్ కృష్ణ గారికి, సోదరుడు మహేష్ బాబుకి, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేశారు.
ఇందిరాదేవి మృతిపై బండి సంజయ్ సంతాపం
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇందిరా దేవి మరణం బాధాకరమని పేర్కొన్న ఆయన కృష్ణ గారికి, మహేష్ బాబుకి, ఇందిరాదేవి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సానుభూతి వ్యక్తం చేశారు.