మహేష్ బాబు కౌంటర్ : జీఎస్టీ కమిషనర్కు లీగల్ నోటీసులు పంపిన ప్రిన్స్
2007-08 సంవత్సరానికి ప్రిన్స్ మహేష్ బాబు సేవా పన్నులు కట్టలేదని చెబుతూ ఆయన బ్యాంకు ఖాతాలను స్తంభింప జేసింది హైదరాబాదు జీఎస్టీ కమిషనరేట్. దీనిపై తీవ్రంగా స్పందించారు ప్రిన్స్ మహేష్ బాబు. జీఎస్టీ కమిషనర్కు లీగల్ నోటీసులు పంపారు. తాను ఎలాంటి పన్నులు కట్టకుండా ఎగ్గొట్టలేదని తెలిపారు మహేష్ బాబు. తను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినని చెప్పారు. పన్నులన్నీ సక్రమంగా కట్టినట్లు మహేష్ బాబు స్పష్టం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న తన బ్యాంకు అకౌంట్లను కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా స్తంభింపజేస్తారని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ పలు ఉత్పత్తులను ప్రమోట్ చేశారని ఆ సమయంలో ఆయన సేవా పన్నులు కట్టలేదంటూ పేర్కొంటూ హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ నోటీసులు పంపింది. దీనిపై వచ్చిన ఆదాయంపై మహేష్ బాబు సర్వీస్ ట్యాక్స్ కట్టలేదని వెల్లడించింది. ఆ ఆర్థిక సంవత్సరానికి పన్ను కట్టకుండా ఉన్న మొత్తం రూ. 18.5 లక్షలుగా జీఎస్టీ అధికారులు తేల్చారు.
మహేష్ బాబు 2007-08 సంవత్సరానికి మొత్తం రూ. 18.5 లక్షల సేవా పన్ను కట్టనందున గురువారం రోజున మహేష్ బాబుకు చెందిన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా, యాక్సిస్ బ్యాంకు ఖాతాలను అటాచ్ చేశారు. దీని విలువ మొత్తం రూ. 73.5 లక్షలు ఉన్నట్లు సమాచారం. ఇందులో జరిమానా పన్నుపై వడ్డీ కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.