రాత్రికి రాత్రే పరిష్కారంకాదు, కెటిఆర్తో కలిసి మహేష్ బాబు వస్తారు: నమ్రత
మహబూబ్ నగర్: సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ శుక్రవారం నాడు తాము దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామాన్ని సందర్శించారు. మహేష్ బాబు కొద్ది రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలోని సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ గ్రామంలో నమ్రతా శిరోద్కర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. త్వరలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మహేష్ బాబులు గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పారు. కలెక్టర్ ఇతర అధికారులతో అభివృద్ధి పనుల విషయమై చర్చిస్తున్నామని చెప్పారు. రాత్రికి రాత్రే సమస్యలు పరిష్కారం కావని, ఒక్కటొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
ఇటీవల గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో గల్లా జయదేవ్ భార్యతో కలిసి పర్యటించి గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు నమ్రతా శిరోద్కర్ ఈ రోజు సిద్ధాపూర్ గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నరు. తాము దత్తత తీసుకున్న గ్రామాన్ని మోడర్న్ గ్రామంగా, స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
దత్తత కాన్సెప్టుతో తెరకెక్కిన మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఏపీలో గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణలో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.