బ్రోకర్, శతఘ్ని.. పవన్ను రోడ్డుపైకి తీసుకొచ్చి సారీ చెప్పిస్తా: మహేష్ కత్తి సంచలనం, మెలిక
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను నిత్యం విమర్శిస్తూ మీడియాలో నానుతున్న మహేష్ కత్తికి ఓ టీవీ ఛానల్ డిబేట్లో పలువురు ప్రముఖులు సూచనలు చేశారు. మహేష్ కత్తి కేసు పెట్టాలని, కానీ ఇలా చేయవద్దని పలువురు సూచించారు. ఆ డిబేట్లో దర్శకులు ఎన్ శంకర్, నటుడు, నిర్మాత రాంకీ తదితరులు మాట్లాడారు.
చదవండి: పోర్న్స్టార్కే: పూనమ్ కౌర్ మళ్లీ సంచలన ట్వీట్, మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాక్!
ఈ ఇష్యూను మొదలు పెట్టింది మహేష్ కత్తి కాబట్టి ఆయనే ముగింపు పలకాలని ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు కూడా చెప్పారు. పవన్ ట్వీట్ చేయరని, ఆయన ఇందులో వేలు పెట్టకుండా ఉండటమే మంచిదని అభిప్రాయపడ్డారు. పదేపదే పవన్ను టార్గెట్ చేస్తూ ప్రచారం కోసం ఉవ్వీళ్లూరుతున్న మహేష్ కత్తినే ఆపితే వివాదం ఆగిపోతుందంటున్నారు. చాలామంది ఇదే విషయం చెప్పారు. అయినా తగ్గటం లేదు.
చదవండి: మహేష్ కత్తి సంచలన విషయం చెప్పిన నిర్మాత, మరిన్ని: కత్తి ఇంటికి పవన్ ఫ్యాన్స్
చదవండి: చిరంజీవి చెప్పిన మాట, అజ్ఞాతవాసి డైలాగ్: ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయా?
పవన్ను నేనే అడుగుతా.. ఎన్ శంకర్ సూచన
తాజా లైవ్ షోలో మాట్లాడుతూ... దర్శకులు ఎన్ శంకర్ మాట్లాడారు. మీ సమస్యను పోలీసులకు తెలియజేయాలని, ఆ తర్వాత అంతా వారు చూసుకుంటారని మహేష్ కత్తికి సూచించారు. కేసు పెట్టిన తర్వాత కూడా మీకు ఇలానే కాల్స్ వస్తే మీ తరఫున తాను నిలబడతానని శంకర్ చెప్పారు. మీత ోపాటు నేను కూడా వచ్చి పవన్ కళ్యాణ్కు ఫ్యాన్స్ గురించి చెబుతానని అన్నారు. మీరే కంట్రోల్ చేయాలని పవన్ను అడుగుతా అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుంది
ఇందులో ఎలాంటి సమస్యా లేదని శంకర్ అన్నారు. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, వారి హక్కులను అనుభవించేలా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటోందని అన్నారు. తప్పకుండా ఈ విషయంలో మీకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మహేష్ కత్తికి సూచించారు.
గుర్తించిన పదిమందిపై ఫిర్యాదు చేస్తా
తాను గుర్తించిన పదిమంది వ్యక్తులపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మహేష్ కత్తి ఎట్టకేలకు చెప్పారు. వాళ్లకు వాళ్లు పవన్ కళ్యామ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ పలు ఛానల్స్ ద్వారా తనకు చేసిన ఫోన్ కాల్స్, పోస్ట్ చేసిన వీడియోల ఆధారంగా ఈ ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
మహేష్ కత్తి మెలిక
జనసేన పార్టీకి చెందిన శతఘ్ని టీవీలో పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడాడో, ఆ వీడియోను కూడా ఫిర్యాదు చేసేటప్పుడు పోలీసులకు ఇస్తానని మహేష్ కత్తి అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తాను చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తానని మెలిక పెట్టారు. ఫిర్యాదు చేసినా తన పోరాటం కొనసాగిస్తానని చెప్పడం ద్వారా పవన్పై విమర్శలు చేస్తానని, అభిమానులను రెచ్చగొడతానని అన్నట్లుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
నేనే ఇండస్ట్రీకి తీసుకొచ్చా కాబట్టి
నటుడు, నిర్మాత రాంకీ, మహేష్ కత్తి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. మహేష్ కత్తి తన ద్వారానే ఇండస్ట్రీకి వచ్చారని, కానీ ఇప్పుడు ఆయన తప్పుడు దారిలో వెళ్తున్నారని రాంకీ అన్నారు. తాను తీసుకు వచ్చిన వ్యక్తి తప్పుడుదారిలో వెళ్తున్నందున చెప్పాల్సిన బాధ్యత తనకు ఉందని చెబుతున్నానని అన్నారు. దీనిపై మహేష్ కత్తి మాట్లాడుతూ.. అంతకుముందు తాను రెండు షార్ట్ ఫిలిమ్స్ తీశానని, ఫ్యూచర్ ఫిల్మ అవకాశం మాత్రం రాంకీ ఇచ్చారని చెప్పారు. కానీ ఆ సినిమా పూర్తి కాలేదన్నారు.
నేను తప్పటడుగు వేయడం లేదు
రాంకీ చెప్పినట్లు తాను ఎక్కడా తప్పటడుగు వేయడం లేదని మహేష్ కత్తి అన్నారు. తనపై దాడి జరుగుతుంటే అడ్డుకుంటున్నానని చెప్పారు. దీంట్లో తాను ఎవర్నీ ఇన్వాల్వ్ చేసినా, ఎవరి గురించి మాట్లాడినా వారు నా గురించి మాట్లాడిన వాళ్లే అన్నారు. నేను హక్కు కోసం పోరాడుతున్నానని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్లు తిట్టడం, ఓ అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు ప్రశ్నించడం ఏ హక్కు కిందకు వస్తుందనేది చాలామంది ప్రశ్న.
పవన్ను రోడ్డు మీదకు తీసుకొచ్చి సారీ చెప్పించుకుంటా
మహేష్ కత్తి - రాంకీ డిబేట్ మధ్యలోకి కోటి అనే ఆర్టిస్ట్ లైవ్లోకి వచ్చారు. ఈ సందర్భంగా మహేష్ కత్తి తీవ్రవ్యాఖ్యలు చేశారు. పవన్ మీకు సారీ ఎందుకు చెప్పాలని, ఆయన చెప్పరని కోటి అన్నారు. దానికి కత్తి స్పందిస్తూ.. రోడ్డు మీదకు తీసుకొచ్చైనా చెప్పించుకుంటా అని ఘాటుగా మాట్లాడారు. కోటి మాట్లాడుతూ.. ఈ వివాదాన్ని మహేష్ కత్తి ప్రారంభించారని గుర్తు చేశారు. నాలుగు నెలలుగా తాము చూస్తున్నామని, కావాలని విమర్శిస్తున్నారన్నారు. ఇది ఏమిటని అడిగితే ప్రీ ప్లాన్డ్గా సమాధానం చెబుతున్నారన్నారు. టెర్రరిస్టులా తయారయ్యాడని, విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు.
నాయకుడు కావాలని, రెచ్చగొట్టేలా పిచ్చిపిచ్చిగా
మహేష్ కత్తిని పవన్ ఫ్యాన్స్ వేధిస్తే డీజీపీ, ముఖ్యమంత్రి వద్దకు వెళ్దామని, విచారణ జరిపిద్దామని కోటి అన్నారు. కానీ పవన్ ఎందుకు స్పందిస్తారని అడిగారు. మహేష్ కత్తికి లా అంటే గౌరవం లేదని, చట్టం అంటే గౌరవం లేదన్నారు. పిచ్చోడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాట్లాడిన ప్రతివాడు పవన్ అభిమాని కాదని, కత్తి తెగిడిచి ఉన్నాడని, ఎవరి సలహాలు అవసరం లేదన్నారు. నాయకుడు కావాలని అలా మాట్లాడుతున్నాడని, పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారన్నారు.
రెచ్చగొట్టి ఫ్యాన్స్ మీద బతుకుతున్నాడు, రెమ్యూనరెషన్
మహేష్ కత్తి మాట్లాడుతూ.. పవన్ అభిమానులను రెచ్చగొట్టి వారి మీద బతికేస్తున్నాడన్నారు. అభిమానుల నుంచి డబ్బులు దోచుకొని రెమ్యునరేషన్ పెంచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓట్లను అమ్ముకుని రాజకీయంగా బతుకుతున్న బ్రోకర్ అన్నారు. పవన్ తప్పు చేస్తున్నారని, మొన్నటి వరకు పవన్ ట్వీట్ చేస్తే చాలని చెప్పానని, ఏం సారీ చెబితే పవన్ తగ్గిపోతారా అని మహేష్ కత్తి నిలదీశారు. సీఎం సారీ చెప్పారని, పవన్ ఎంత అన్నారు. నన్ను రెచ్చగొడుతున్నారు కాబట్టి పవన్ సారీ చెప్పాల్సిందే అన్నారు. ప్రజాస్వామ్యం అర్థం కాని అభిమానులతో పవన్కే నష్టం అన్నారు. పవన్ అయినా ప్రధాని అయినా తన ఆత్మగౌరవం కించపరచవద్దన్నారు. శతఘ్ని అనే టీంను పెట్టి ఐసిస్ను తయారు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ను రోడ్డు మీదకు తెచ్చి సారీ చెప్పించుకుంటానని, ప్రపంచమంతా కలిసి వచ్చినా వెనక్కి తగ్గనని చెప్పారు.