టిఆర్ఎస్లో కుమ్ములాట: ఎమ్మెల్యే తీగలపై గులాబీ కేడర్ ఆగ్రహం
హైదరాబాద్: టిఆర్ఎస్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి పైన గులాబీ క్యాడర్ భగ్గుమంటోందని వార్తలు వస్తున్నాయి. తీగల పైన స్థానిక కార్యకర్తలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
తీగల తీరు పైన మహేశ్వరం మండల టిఆర్ఎస్ అధ్యక్షులు కూన యాదయ్యతో పాటు పలువురు సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యే తమ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.
పైగా మీ అందరి గురించి నాకు తెలుసునని, ఏం చేసుకుంటారో చేసుకోమని ఎమ్మెల్యే తమ పైన ప్రతిదాడి చేస్తున్నారని ఆరోపించారు. తాగునీటి ఎద్దడి పైన చర్చించేందుకు సోమవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులతో ఎమ్మెలయే తీగల భేటీ అయ్యారు.
ఈ సమావేశానికి మహేశ్వరం అధ్యక్షులు కూన యాదయ్య వచ్చారు. ఈయన మాట్లాడుతూ... అధికారులు పార్టీ నేతలకు తెలియకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ... ఇది పార్టీ సమావేశం కాదని, తాగునీటిపై మాట్లాడాలని సూచించారు.
దీనిపై టిఆర్ఎస్ నాయకులు కొందరు ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. భేటీలో గందరగోళం ఏర్పడింది. ఎమ్మెల్యే తీగల పైన సీఎం కెసిఆర్కు ఫిర్యాదు చేయాలని స్థానిక నేతలు నిర్ణయించారని తెలుస్తోంది.