రోహింగ్యాలు ఇక్కడే ఉన్నారా?: కిషన్ రెడ్డికి మహమూద్ అలీ కౌంటర్
హైదరాబాద్: ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కౌంటర్ ఇచ్చారు. రోహింగ్యాలు దేశమంతటా ఉన్నారని.. ప్రత్యేకంగా తెలంగాణలోనే ఆశ్రయం పొందుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు.
జమ్మూకాశ్మీర్ తర్వాత హైదరాబాద్లోనే రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారని, వారికి ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహమూద్ అలీ స్పందించారు.
కాంగ్రెస్ నేత, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని మహమూద్ అలీ అన్నారు. హుజుర్నగర్లో ఎవరిపైనా అక్రమ కేసులు బనాయించలేదని ఆయన తెలిపారు. ఏదైనా గొడవ జరిగితే టీఆర్ఎస్ తోపాటు ఎవరిపైనైనా కేసులు నమోదవుతాయని అన్నారు. హుజుర్నగర్లో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న సర్పంచులను అరెస్ట్ చేసినట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని హోంమంత్రి చెప్పారు.
కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మహమూద్ అలీ అన్నారు. నియామక ప్రక్రియను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు. తప్పులు జరిగాయని కొందరు ఫెయిలైన అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇది ఇలావుంటే, ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్ తర్వాత హైదరాబాద్లోనే ఎక్కువ మంది రోహింగ్యాలు నివసిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ సరిహద్దు ఉన్న కాశ్మీర్, అసోం వంటి రాష్ట్రాలకు విదేశీయులు వస్తుంటారని.. కానీ దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ రోహింగ్యాలకు ఎలా అడ్డాగా మారిందని ప్రశ్నించారు. నగరంలోకి వచ్చిన రోహింగ్యాలకు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని, వారికి ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.