తండ్రికి బెయిల్ రావడంపై అమృత ఆందోళన... ప్రణయ్ కుటుంబానికి రక్షణ కల్పించాలని వినతి
నల్గొండ: గతేడాది తెలంగాణలో ఓ పరువు హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రణయ్ అనే యువకుడిని అమృత పెళ్లి చేసుకోవడంతో ఆమె తండ్రి మారుతీరావు బాబాయ్ శ్రవణ్ కుమార్లు కలిసి ప్రణయ్ను హత్య చేయించారు. నల్గొండతో పాటు తెలుగురాష్ట్రాలను సైతం ఈ ఘటన కుదిపేసింది. ప్రస్తుతం మారుతీరావు వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనతో పాటు సోదరుడు శ్రవణ్ కుమార్ కూడా అదే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం మారుతీరావు, శ్రవణ్కుమార్ కరీంలు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ ఇవ్వరాదని పోలీసులు కోర్టుకు తెలపడంతో హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేయలేదు.
ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు
రెండు నెలల క్రితం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురికావడంతో రెండోసారి బెయిల్ కోసం నిందితులు ప్రయత్నించారు. తమకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ముగ్గురు నిందితులు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈసారి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన తండ్రికి బాబాయ్కి, మరో నిందితుడు కరీంకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ప్రణయ్ భార్య అమృత తీవ్రంగా స్పందించింది. పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన వారిపై పీడీ యాక్ట్ కొట్టివేసి బెయిల్ మంజూరు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అమృత తెలిపింది. అంతేకాదు నిందితులు బయటకు వస్తే తమను కచ్చితంగా బతకనియ్యరనే భయాన్ని అమృత వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే తమ కొడుకును అతి కిరాతకంగా నరికి చంపిన వారికి బెయిల్ ఇవ్వడమేంటని ప్రణయ్ తండ్రి ప్రశ్నించారు. వారికి కఠిన శిక్షపడుతుందనే నమ్మకం తనకుందని తెలిపాడు.
ప్రణయ్ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తాం
ఇదిలా ఉంటే ప్రణయ్ కుటుంబానికి రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. వారికి ఎలాంటి హాని కలగకుండా చూసే బాధ్యత పోలీసులదని ఆయన హామీ ఇచ్చారు. నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు.
నాడు తెలంగాణను కుదిపేసిన హత్య
ప్రణయ్ హత్య జరిగిన సమయంలో అమృత గర్భవతి. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు ఆస్పత్రి ప్రాంగణం దాటగానే నిందితుడు వెనకనుంచి వచ్చి ప్రణయ్పై కత్తితో దాడి చేసి అతికిరాతకంగా హత్య చేశాడు. దీంతో ఒక్కసారిగా మిర్యాలగూడ ప్రాంతం ఉలిక్కిపడింది. హత్య తర్వాత పారిపోవాలని చూసిన తండ్రి మారుతీరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆయన ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్, మరో వ్యక్తి కరీంలపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రణయ్ హత్య సమయానికి ఐదునెలల గర్భవతిగా ఉన్న అమృత ఈ మధ్యే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.