ఎవరి ఖర్చు వారిదే: స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చులకు చేతులెత్తేసిన ప్రధాన పార్టీలు
హైదరాబాదు: వరుస ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రం బిజీ అయిపోయింది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు నాయకులు విపరీతంగా ఖర్చు పెట్టారు. తాజాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవరి ఖర్చులు వారివే అని రెండు ప్రధాన పార్టీలు తేల్చేశాయి.
స్థానిక సంస్థల పోరుకు ఖర్చు మీదే
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జరిగిన ఎన్నికలతో ఖర్చు తడిసి మోపెడు అవడంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులకు ఎలాంటి ఫండింగ్ ఇవ్వబోమని తేల్చేశాయి. దమ్మిడి కూడా ఇచ్చేది లేదంటూ చెప్పిన పార్టీలు ఎవరి ఖర్చులు వారు పెట్టుకోవాలని తమ అభ్యర్థులను సూచించాయి. దీంతో స్థానిక సంస్థల పోటీలో ఉన్న అభ్యర్థులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పార్టీ తరపున ఇచ్చే డబ్బులు ఎన్నికల ఖర్చుకు వస్తుందని భావించిన నాయకులు ఇప్పుడు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారు.
జడ్పీటీసీ అయితే ఒక రేటు...ఎంపీటీసీ అయితే మరో రేటు
తెలంగాణలో 535 జిల్లా పరిషత్తు స్థానాలుండగా... ఎంపీటీసీ స్థానాలు 5,317 ఉన్నాయి. ఇక ఈ ఎన్నికల్లో జడ్పీటీసీ కోసం పోటీ చేస్తున్న నేతలు రూ.50 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో ఉంటున్న నేతలకు రూ.10 లక్షలు వరకు ఖర్చు అవుతుందని బడా నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారికంగా ఒక జడ్పీటీసీ స్థానం కోసం పోటీ చేస్తున్న అభ్యర్థి రూ.4 లక్షల కంటే ఎక్కువగా ఖర్చు చేయరాదు. మరోవైపు ఎంపీటీసీ అభ్యర్థి రూ. 1.5 లక్షల కంటే ఎక్కువగా ఖర్చు చేయరాదు. ఇదిలా ఉంటే ఎలాగైనా జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవి చేజిక్కించుకోవాలంటే దాదాపు రూ.2 కోట్లు వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లా పరిషత్ ఛైర్మెన్ అభ్యర్థిపైనే ఆధారం
ఇక ఓటు వేసే ప్రతి వ్యక్తి రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి ఎంపీటీసీ రెండో ఓటు జడ్పీటీసీకి వేయాల్సి ఉంటుంది. ఇక ఎంపీటీసీ అభ్యర్థులు తమ సొంత ఖర్చులు పెట్టుకుని మిగతా డబ్బుల కోసం జడ్పీటీసీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక ఒక జడ్పీటీసీ కింద సగటున 10 మంది ఎంపీటీసీలు ఉంటారు. ఇక జడ్పీటీసీలు మాత్రం జిల్లా పరిషత్ ఛైర్మెన్గా ఎవరైతే కావాలని భావిస్తున్నారో ఆ అభ్యర్థిపై ఫండ్స్ కోసం ఆధారపడుతున్నారు. ఇక చాలా జిల్లాల్లో జిల్లా పరిషత్ ఛైర్మెన్ అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తామని టీఆర్ఎస్ చెబుతోంది. ఇక ప్రకటించిన ఆ అభ్యర్థే అన్ని ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుందని అధిష్టానం హుకూం జారీచేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎమ్మెల్యేలు కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అభ్యర్థులు భారీగానే ఖర్చు పెట్టుకున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టుకోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు చేతులెత్తేసినట్లుగా సమాచారం. ఇక టీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ హైకమాండ్ నిధులు సమకూరుస్తుంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీపీసీసీ వద్ద డబ్బులు లేవని తెలుస్తోంది.
గాంధీ భవన్ నిర్వహణకే డబ్బులు అంతంత మాత్రం
ఇక మూడురోజుల క్రితం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... పార్టీ నిధులు సమకూర్చే స్థితిలో లేనప్పుడు బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికను స్థానిక నేతలకే వదిలివేయాలని అన్నారు. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పాలసీతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి గాంధీభవన్ నిర్వహణ కోసం రూ. కోటి అవుతుండగా.. అందులో పనిచేసే సిబ్బంది వేతనాలు చెల్లించేందుకు రూ. 10 లక్షలు ఖర్చు అవుతోందని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు. అంతేకాదు ప్రతినెలా టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలు ప్రతినెల నిధులు సమకూరుస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బరిలో నిలిచే స్థానిక నాయకులు ఎన్నికల ఖర్చు కోసం పార్టీపై ఆధారపడొద్దని తేల్చి చెప్పినట్లు ఆ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.