భారీ నగదుతో పట్టుబడిన మావోయిస్టు?
చికిత్స పొందుతున్న ఇద్దరూ మావోయిస్టులేనని సమాచారం. పది రోజుల కిందట ఛత్తీస్గఢ్లోని గొల్లపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని పోటుగపల్లి అటవీ ప్రాంతంలో బుల్లెట్ గాయాలైన గిరిజనుడు మడకం లక్ష్మయ్య ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. గేదెలు కాసేందుకు వెళితే బుల్లెట్ గాయం అయినట్టు ప్రచారం.
మిలీషియా సభ్యుడిగా ఇతడు మావోయిస్టులకు సహకరిస్తున్నట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం. మాసికీమూయ అనే గిరిజన యువకుడిని బుల్లెట్ గాయంతో సోమవారం తెల్లవారు జామున భద్రాచలంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువచ్చారు. వేటకు వెళ్లిన సమయంలో నాటు తుపాకీ పేలి గాయమైందని ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు అనధికారికంగా చెప్పాయి.
కానీ, గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయని, ఆ కాల్పుల్లో గాయపడ్డ వారికే భద్రాచలంలో చికిత్స చేయిస్తున్నారని సమాచారం. మావోయిస్టు అగ్రనేతకు భారీగా డబ్బులు చేరవేసే ప్రయత్నంలో ఉన్న ఖమ్మం జిల్లా చర్ల మండలానికి చెందిన ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు భద్రాచలంలో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరంగల్ నుంచి రూ.5 లక్షల నగదుతో బస్సులో వస్తుండగా పోలీసుల తనిఖీలో సదరు వ్యక్తి పట్టుబడ్డట్లు సమాచారం.