వంశీకి షాక్: కారెక్కిన సన్నిహితులు, కొల్లాపూర్లో కాంగ్రెస్ ఇలా..
2019 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ మహబూబ్నగర్ జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు చోటు చేసుకొంటున్నాయి.
మహబూబ్నగర్: 2019 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ మహబూబ్నగర్ జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలను, కార్యకర్తలను టిఆర్ఎస్లో చేరేలా ఆ పార్టీ నాయకత్వం వ్యూహన్ని రచిస్తోంది. విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఆపరేషన్ ఆకర్ష్కు టిఆర్ఎస్ తెరతీసింది.
Recommended Video
మహబూబ్నగర్ జిల్లాలో గతంలో టిడిపికి మంచి పట్టుంది. ఈ జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2009 ఎన్నికల్లో ఆ పార్టీ 9 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంది. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో టిడిపి విజయం సాధించింది.
2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో టిడిపి తీవ్రంగా నష్టపోయింది. రేవంత్రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఆ పార్టీ ఇంకా తీవ్రంగా దెబ్బతింది.టిడిపికి చెందిన నేతలపై టిఆర్ఎస్ కన్నేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడ టిడిపి నేతలపై వల విసిరేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
కల్వకుర్తిలో వంశీకి చెక్ పెట్టేందుకు
2014లో కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వంశీచంద్రెడ్డి విజయం సాధించారు.అయితే అసెంబ్లీలోనూ, బయట టిఆర్ఎస్ నేతలకు వంశీచంద్రెడ్డి సవాల్ విసురుతున్నారు. అయితే రాజకీయంగా వంశీచంద్రెడ్డిని దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. నగర పంచాయతీ చైర్మన్తో పాటు ఆ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కారెక్కారు. నగర పంచాయతీలో ఆరుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ బలం ఒకటికి పడిపోయింది. ఎమ్మెల్యే వంశీచంద్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సుదర్శన్రెడ్డి, చింతా రాంమోహన్రెడ్డిలు సైతం టీఆర్ఎస్లో చేరారు.
అచ్చంపేట టిడిపిలో వలసలు
రేవంత్రెడ్డి ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి అచ్చంపేట నియోజకవర్గం నుండి వలసలు పెరిగాయి. అచ్చంపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి భారీగా టీఆర్ఎస్లోకి వలసలు చోటుచేసుకున్నాయి. అచ్చంపేట ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ సభ్యుడు కె.రామకృష్ణారెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు నర్సింహారెడ్డి, కొండనాగులకు చెందిన చంద్రమోహన్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బల్మూర్ జెడ్పీటీసీ సభ్యుడు ధర్మానాయక్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా ఉప్పునుంతల ఎంపీపీ అరుణమ్మ, అమ్రాబాద్ ఎంపీపీ రామచంద్రమ్మ, వంగూరు ఎంపీపీ భాగ్యమ్మ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వలస వచ్చారు.టిడిపి అచ్చంపేట ఇంచార్జీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కొల్లాపూర్లో జూపల్లిని వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్లాన్
కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు వ్యతిరేక వర్గీయులను ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా ఉంటూ జూపల్లి కృష్ణారావు తన పదవికి తెలంగాణ కోసం రాజీనామా చేశారు. ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరారు.అయితే ఈ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు వ్యతిరేక వర్గీయులను ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది.
నాగర్కర్నూల్ నుండి రాజేష్ పోటీ
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూచకుళ్ళ రాజేష్ నాగర్ కర్నూల్ అసెంబ్లీ నుండి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గం నుండి పలు దఫాలు కూచకుళ్ళ దామోదర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.దామోదర్రెడ్డి ఎమ్మెల్సీగా పదవీ కాలం ఇంకా మిగిలి ఉండడంతో అసెంబ్లీ బరిలో తన కుమారుడిని దింపాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి రాజేష్ కూడ ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది.