రేవంత్ ఎఫెక్ట్: కోమటిరెడ్డిపై ప్రభావం, మూడో కూటమితో ఎవరికి నష్టం?
రేవంత్ ఎపిసోడ్ తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కన్పించే అవకాశం ఉందంటున్నారు.
నల్లగొండ: రేవంత్ ఎపిసోడ్ తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కన్పించే అవకాశం ఉందంటున్నారు.
రేవంత్రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్రెడ్డి వెంట కొందరు కీలకమైన టిడిపి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు టిడిపి నేతలు రేవంత్రెడ్డి వెంట ఇద్దరు నేతలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కంచర్ల భూపాల్రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీని కాకుండా టిఆర్ఎస్ను ఎంచుకొన్నారు. అంతేకాదు స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
నల్గొండ రాజకీయాల్లో మార్పులు
రేవంత్రెడ్డి ఎపిసోడ్ తర్వాత నల్లగొండ రాజకీయాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకొంటున్నాయి. టిడిపి నుండి టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో నేతలు చేరుతున్నారు. ఈ పరిస్థితులు 2019 ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపటే అసెంబ్లీ ఇంచార్జీ పటేల్ రమేష్రెడ్డి, దేవరకొండ అసెంబ్లీ ఇంచార్జీ బిల్యానాయక్ టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్గొండ అసెంబ్లీ ఇంచార్జీ కంచర్ల భూపాల్రెడ్డి టిఆర్ఎస్లో చేరనున్నారు. 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు, ఈ జిల్లాలో వామపక్షాలకు కూడ మంచి ఓటింగ్ ఉంది. ఎన్నికల సమయం నాటికి రాజకీయ సమీకరణాల్లో మార్పులు ఏ పార్టీకి ప్రయోజనం కల్గిస్తాయోననే ఉత్కంఠ నెలకొంది.
నల్గొండలో కంచర్ల భూపాల్రెడ్డి కన్పించేనా?
నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న కంరచ్ల భూపాల్రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్లో చేరనున్నారు. ఈ నియోజకవర్గంలో టిడిపికి ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు 1999 నుండి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజయం సాధిస్తున్నారు. రేవంత్రెడ్డి వెంట కంచర్ల భూపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే టిక్కెట్టు దక్కే అవకాశం కన్పించలేదు. దీంతో కంచర్ల భూపాల్రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. అయితే 2019 ఎన్నికల్లో నల్గొండలో కాంగ్రెస్కు టిఆర్ఎస్ నుండి గట్టిపోటీ ఇచ్చే అవకాశం కన్పిస్తోంది.
దేవరకొండలో కాంగ్రెస్పార్టీకి అభ్యర్థి
2019 ఎన్నికల్లో దేవరకొండ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బిల్యానాయక్కు టిక్కెట్టు దక్కే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి బిల్యానాయక్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి సిపిఐ అభ్యర్థి రవీంద్రకుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన బాలునాయక్ టిఆర్ఎస్లో చేరారు. దీంతో బిల్యానాయక్కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కనుంది. అయితే ఈ స్థానంలో సిపిఐ, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు బలంగానే ఉంటాయి. అయితే కీలకమైన నేతలు టిఆర్ఎస్లో చేరారు. మరోవైపు ఎన్నికల సమయంలో పార్టీలు, కూటముల మధ్య పొత్తుల ప్రభావం కూడ గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
కాంగ్రెస్కు కలిసొచ్చేనా
సూర్యాపేటలో కాంగ్రెస్కు 2019 ఎన్నికల్లో కలిసివస్తోందా అనే చర్చ సాగుతోంది.సూర్యాపేట టిడిపి అసెంబ్లీ ఇంచార్జీ పటేల్ రమేష్రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి నేతృత్వంలో పటేల్రమేష్రెడ్డి రెండు రోజుల క్రితం సూర్యాపేటలో సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జగదీశ్వర్రెడ్డి విజయం సాధించారు. 2004,2009 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్రెడ్డి విజయం సాధించారు.
పొత్తులు, కూటముల ప్రభావం
2019 ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పొత్తులు, కూటముల ప్రభావం కూడ కన్పించే అవకాశం ఉంది. ఈ జిల్లాలో కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్, వామపక్షాలు బలంగానే ఉన్నాయి. అయితే ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసుకొనే పొత్తులు, కూటముల మధ్య చోటుచేసుకొనే అవగాహన కూడ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.